హైదరాబాద్: భారత జట్టులో వెటరన్లుగా క్రికెటర్లుగా వెలుగొందుతున్న మహేంద్ర సింగ్ ధోని, యువరాజ్ సింగ్ల భవిష్యత్తేంటన్న ప్రశ్న మరోసారి ఉత్పన్నమైంది. టెస్టు క్రికెట్కు వీడ్కోలు పలికిన ధోని పరిమిత ఓవర్ల క్రికెట్కు ప్రాతినిథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే.
వన్డేలు, టీ20ల్లో ఈ ఇద్దరికీ జట్టులో చోటు కల్పిస్తుండటంపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తున్న సంగతి తెలిసిందే. వారిపై ఓ నిర్ణయం తీసుకోవాలన్న డిమాండ్లు కూడా వినిపిస్తున్నాయి. అండర్-19 జట్టు కోచ్ రాహుల్ ద్రవిడ్ సైతం వీరిద్దరి భవిష్యత్తుపై ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని గతంలో సూచించాడు.

అయితే ధోని, యువీ భవిష్యత్తుపై తొందర పడాల్సిన అవసరం లేదని చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ అభిప్రాయపడ్డాడు. సరైన సమయంలో కెప్టెన్ విరాట్ కోహ్లి, కోచ్ రవిశాస్త్రిలతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని ఎమ్మెస్కే వెల్లడించాడు.
'వాళ్ల భవిష్యత్పై మేం చర్చించాల్సి ఉంది. ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి. అయితే అది ఎప్పుడన్నది ముందు నిర్ణయించాలి. సడెన్గా ఏదో ఒక నిర్ణయం తీసుకోలేం. దానికి పూర్తిగా సంసిద్ధమైన తర్వాతే తుది నిర్ణయం ఉంటుంది' అని ఎమ్మెస్కే ప్రసాద్ అన్నాడు.
'ఎవరి వల్ల జట్టుకు విలువ చేకూరుతుందో మనందరికీ తెలుసు. ఒక్కో స్థానం గురించి ప్రత్యకంగా ఆలోచించాలి. తగిన సన్నద్ధత లేకుండా నిర్ణయం తీసుకోవడం సరికాదు. ఆ విషయంలో మేం సమతూకంతో ఉండాలి' అని ఎమ్మెస్కే అన్నాడు.
ఛాంపియన్స్ ట్రోఫీ 2019 వరల్డ్ కప్ జరిగే ఇంగ్లాండ్లోనే జరగడం వల్ల జట్టులోని లోటుపాట్లు తమకు తెలిశాయని ఎమ్మెస్కే చెప్పాడు. కొన్ని లోపాలు తమకు కనిపించాయని, రానున్న 20 నెలల్లో వాటిని సరిదిద్దుతామని అతను స్పష్టంచేశాడు.
సీనియర్ల స్థానంలో ఒక యువ ఆటగాడికి వరల్డ్కప్లో స్థానం కల్పించాలంటే అంతకుముందే అతనికి సరిపడినన్ని అవకాశాలు ఇవ్వాల్సి ఉంటుందని ప్రసాద్ అన్నాడు. శ్రీలంక పర్యటనకు బుమ్రాను కాదని హార్దిక్ పాండ్యాను ఎంపిక చేయడాన్ని కూడా ఎమ్మెస్కే సమర్థించుకున్నాడు.
పాండ్యా ఆల్రౌండర్ కావడంతో పాటు మూడో పేసర్ బాధ్యతను నిర్వర్తించగలడని భావించే అతన్ని లంక పర్యటనకు ఎంపిక చేశామని చెప్పాడు. ఇక జట్టు ఎంపికలో తుది నిర్ణయం సెలక్షన్ కమిటీదేనని, ఈ విషయంలో ఇప్పటి కెప్టెన్ కోహ్లీ, మాజీ కెప్టెన్ ఎమ్మెస్ ధోనీ తమకు పూర్తిగా సహకరించారని ఎమ్మెస్కే పేర్కొన్నాడు.