ముంబై: ఒకప్పటి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ప్రాంచైజ్ డెక్కన్ ఛార్జర్స్ (డీసీ) యాజమాన్యం వేసిన కేసులో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)కి భారీ ఊరట లభించింది. డెక్కన్ క్రానికల్ హోల్డింగ్స్ (డీసీహెచ్ఎల్) యాజమాన్యంకు రూ.4,800 కోట్లు చెల్లించాలంటూ గతంలో బీసీసీఐకి ఆర్బిటర్ ఇచ్చిన ఆదేశాలను (మధ్యవర్తిత్వ ఉత్తర్వులను) బాంబే హైకోర్టు కొట్టిపారేసింది. జస్టిస్ జీఎస్ పటేల్తో కూడిన బెంచ్ తాజా ఆదేశాలను జారీ చేసింది. కోర్టు తీర్పు సంతోషకరంగా ఉందని, తాము అన్నీ అగ్రిమెంట్ ప్రకారమే చేశామని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు.
ఐపీఎల్లో 2008 నుంచి 2012 వరకు ఐదేళ్ల పాటు దక్కన్ చార్జర్స్ జట్టు కొనసాగింది. 2009లో చాంపియన్గా కూడా నిలిచింది. డీసీహెచ్ఎల్ కంపెనీ ఈ టీమ్ను ప్రమోట్ చేసింది. అయితే 2012లో రూ.100 కోట్ల బ్యాంకు గ్యారంటీని చూపించడంలో విఫలమైందంటూ బీసీసీఐ షోకాజ్ నోటీసు ఇవ్వడంతో వివాదం తలెత్తింది. వివరణ కోసం చార్జర్స్కు 30 రోజుల గడువు ఇచ్చినా.. అది పూర్తి కాకముందే టీమ్ను రద్దు చేస్తున్నట్లు బోర్డు ప్రకటించింది. 2012 సెప్టెంబరులో ఆ జట్టును ఐపీఎల్ నుంచి తప్పిస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది.
WTC Final: 'టీమిండియాతో ఆడేటప్పుడు.. ఆ టెస్ట్ సిరీస్ విజయం లెక్కలోకి రాదు'
దక్కన్ చార్జర్స్ స్థానంలో మరో జట్టు కోసం బిడ్లను ఆహ్వానించగా.. సన్రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం ఆ అవకాశాన్ని దక్కించుకుంది. అయితే లీగ్ నుంచి తమ జట్టును చట్ట విరుద్ధంగా తొలగించారని డీసీహెచ్ఎల్ బాంబే హైకోర్టును ఆశ్రయించింది. చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడిన జట్లను జరిమానా వంటి స్వల్ప శిక్షలతో సరిపెట్టిన బోర్డు.. చిన్న తప్పుకే తమ జట్టును తొలగించడం అన్యాయమని డీసీహెచ్ఎల్ వాదించింది. ఐపీఎల్ ఫ్రాంచైజీ ఒప్పందం ప్రకారం బాంబే హైకోర్టు ఆదేశాలతో సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సీకే ఠక్కర్ మధ్యవర్తిగా వాదనలు మొదలయ్యాయి.
నష్టపరిహారం, వడ్డీ, ఇతర ఖర్చుల కింద తమకు రూ. 8 వేల కోట్లు బీసీసీఐ చెల్లించాలని దక్కన్ చార్జర్స్ బాంబే హైకోర్టును కోరింది. అయితే ఫ్రాంచైజీ ఫీజు కింద మిగిలిన ఐదేళ్లకు కలిపి రూ. 214 కోట్లు డీసీ తమకు చెల్లించాలని బోర్డు తెలిపింది. అన్ని వాదనలు విని.. జట్టును రద్దు చేయడం సరైంది కాదంటూ నష్టపరిహారంగా రూ. 4,814.67 కోట్లతో పాటు ఆర్బిట్రేషన్ మొదలైన 2012నుంచి ఏడాదికి 10 శాతం వడ్డీ, ఖర్చులకు మరో రూ. 50 లక్షలు చెల్లించాలని ఆదేశించారు. ఆ ఆదేశాలను బీసీసీఐ కోర్టులో సవాల్ చేసింది. దానిపై బాంబే హైకోర్టు ఇప్పుడు తీర్పు ఇచ్చింది.