హైదరాబాద్: జెర్సీ నెంబర్ 10... ప్రపంచ క్రీడారంగంలో ఈ నెంబర్కు ఎంతో ప్రత్యేకత ఉంది. ప్రతి క్రీడలో ఈ జెర్సీ ధరించిన ఆటగాడు అత్యుత్తమ ఆటగాడై ఉంటాడు. క్రికెట్లో ఎన్నో ప్రపంచ రికార్డులను నెలకొల్పిన భారత క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ 10వ నెంబర్ జెర్సీనే తన కెరీర్ అసాంతం ధరించాడు.
సచిన్ టెండూల్కర్ అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన సమయంలో గౌరవ పూర్వకంగా తాము 10 నెంబర్కు కూడా రిటైర్మెంట్ ఇస్తున్నామని... భవిష్యత్తులో ఏ భారత క్రికెటర్ కూడా ఆ అంకెతో జెర్సీ ధరించడని బీసీసీఐ అప్పట్లో ఘనంగా ప్రకటించింది.

అయితే కొలంబో వేదికగా గురువారం శ్రీలంకతో జరిగిన నాలుగో వన్డేలో ఆశ్చర్యకరంగా 10 నెంబర్ జెర్సీ మరోసారి మైదానంలో కనిపించింది. నాలుగో వన్డేతో అంతర్జాతీయ వన్డే అరంగేట్రం చేసిన పేసర్ శార్దుల్ ఠాకూర్ 10 నంబర్ జెర్సీతో ఆడటం అందరినీ ఆశ్చర్యపరచింది.
ఈ క్రమంలో బీసీసీఐ తన మాటను నిలబెట్టుకోవడంలో విఫలమైందని సచిన్ టెండూల్కర్ అభిమానులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. నాలుగో వన్డేలో శార్దుల్ ఠాకూర్ ఒక వికెట్ తీసి 26 పరగులిచ్చాడు. అంతేకాదు భారత్ తరఫున వన్డేలు ఆడిన 218వ క్రికెటర్గా శార్దుల్ గుర్తింపు పొందాడు.
అయితే, శార్దూల్ ఈ జెర్సీ ధరించడాన్ని గుర్తించిన క్రికెట్ కామెంటేటర్ హర్షాభోగ్లే ఫొటోను షేర్ చేశాడు. అదికాస్తా వైరల్గా మారింది. సచిన్కు తప్ప ఆ జెర్సీని ధరించే అర్హత మరెవరికీ లేదని నెటిజన్లు కామెంట్ చేశారు. ఆ జెర్సీ కథ ఇక ముగిసిందని, అది దేవుడిదని, వేరెవరికీ దానిని ధరించే అర్హత లేదంటూ ట్విట్టర్లో పోస్టు చేస్తున్నారు.
ఠాకూర్ ఇకనైనా ఈ జెర్సీని విడిచిపెట్టాలని సచిన్ అభిమానులు కోరుతున్నారు. నాలుగో వన్డే ప్రారంభానికి ముందు టీమిండియా ప్రధాన కోచ్ రవిశాస్త్రి శార్దుల్ ఠాకూర్కి వన్డే క్యాప్ ఇచ్చాడు. ఇక ఐదు వన్డేల సిరిస్లో ఇరు జట్ల మధ్య ఆఖరి వన్డే ఆదివారం జరగనుంది.