
సిడ్నీ: ఎంతో విలువైన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) కాంట్రాక్ట్లు దక్కించుకోవడం కోసం ఆస్ట్రేలియా క్రికెటర్లు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీతో మంచిగా ఉండడానికి ప్రయత్నించారని, అతణ్ని స్లెడ్జింగ్ చేయడానికి బయపడుతూన్నారని ఆ జట్టు మాజీ కెప్టెన్ మైకెల్ క్లార్క్ ఇటీవల సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. క్లార్క్ వ్యాఖ్యలను టీమిండియా మాజీ ఆటగాడు వీవీఎస్ లక్ష్మణ్ అప్పుడే తప్పుపట్టాడు. టీమిండియా ఆటగాళ్లతో స్నేహం ఉన్నంత మాత్రాన వారికి ఐపీఎల్ కాంట్రాక్టు లభిస్తుందని అనుకోవడం హాస్యాస్పదమే అని అన్నాడు.
తాజాగా ఈ వ్యవహారంపై ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ డీన్ జోన్స్ స్పందించాడు. విరాట్ కోహ్లీపై స్లెడ్జింగ్కి దిగకపోవడమే మంచిదని ఆయన అభిప్రాయపడ్డాడు. 2018-19లో ఆసీస్ పర్యటనలో ఆస్ట్రేలియా క్రికెటర్లు స్లెడ్జింగ్ చేయకపోవడానికి ఐపీఎల్ కాంట్రాక్ట్లు కారణం కాదని తాజాగా వివరణ ఇచ్చాడు. గతంలో కూడా కొంత మంది క్రికెటర్లపై ఆసీస్ ఆటగాళ్లు అదే తరహాలో (స్లెడ్జింగ్ చేయకుండా) జాగ్రత్తగా వ్యవహరించడాన్ని జోన్స్ గుర్తు చేశాడు.

2018-19లో పర్యటనలో విరాట్ కోహ్లీపై ఆస్ట్రేలియా క్రికెటర్లు మౌనంగా ఉండటానికి గల కారణాన్ని నేను వివరిస్తా. గతంలో వివ్ రిచర్డ్స్ బ్యాటింగ్కి వస్తే.. మేము సైలెంట్గా ఉండేవాళ్లం. అలానే జావెద్ మియాందాద్, మార్టిన్ క్రౌ విషయంలోనూ జాగ్రత్తగా వ్యవహరించేవాళ్లం. వాళ్లని రెచ్చగొడితే ఆ తర్వాత మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని మేము అలా చేసేవాళ్లం. విరాట్ కోహ్లీ కూడా ఆ జాబితాలోకి వస్తాడు. అందుకే ఆస్ట్రేలియా క్రికెటర్లు ఆ సిరీస్లో కోహ్లీపై స్లెడ్జింగ్కి దిగలేదు. ఇదే అసలు నిజం' అని డీన్ జోన్స్ వివరణ ఇచ్చాడు. .
ఐపీఎల్ కాంట్రాక్ట్లను కాపాడుకునేందుకు విరాట్ కోహ్లీతో జాగ్రత్తగా వ్యహరించారనే ఆరోపణల్లో ఏమాత్రం నిజం లేదని డీన్ జోన్స్ చెప్పుకొచ్చాడు. ఐపీఎల్లో ఆడకుండా ఏ క్రికెటర్ని విరాట్ కోహ్లీ ఆపలేడని ఆయన పేర్కొన్నాడు. విరాట్ కోహ్లీ ప్రపంచంలోనే అత్యుత్త ఆటగాడని, కోహ్లీ లేకపోతే ఏ ఫార్మాట్లోనైనా టీమిండియా కాస్త బలహీనపడుతుందని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ అభిప్రాయపడ్డాడు. ఈ ఏడాది చివర్లో భారత్ జట్టు నాలుగు టెస్టుల సిరీస్ కోసం ఆస్ట్రేలియా పర్యటనకి వెళ్లనున్న విషయం తెలిసిందే.
అంతర్జాతీయ క్రికెట్లోనే కాదు ఐపీఎల్ టోర్నీలోనూ భారత్ బలమేంటో అందరికీ తెలుసని, ఆసీస్ ఆటగాళ్లే కాకుండా దాదాపు అన్ని జట్ల ప్లేయర్లు టీమిండియాకు వ్యతిరేకంగా ఉండటానికి ఇష్టపడరని ఇటీవల మైకేల్ క్లార్క్ వ్యాఖ్యానించాడు. భారత క్రికెటర్లపై స్లెడ్జింగ్కి దిగితే.. తమ ఐపీఎల్ కెరీర్ ప్రమాదంలో పడుతుందని ఆస్ట్రేలియా క్రికెటర్లు భయపడుతున్నారని, మరీ ముఖ్యంగా విరాట్ కోహ్లీ విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారని ఈ ఆసీస్ మాజీ కెప్టెన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు.