హైదరాబాద్: ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ డీన్ జోన్స్పై భారత అభిమానులు మండిపడుతున్నారు. ముంబైలోని వాంఖడె స్టేడియంలో ఆదివారం న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తన కెరీర్లో 31వ సెంచరీని సాధించిన సంగతి తెలిసిందే.
దీంతో వన్డేల్లో అత్యధిక సెంచరీలు సాధించిన రెండో క్రికెటర్గా విరాట్ కోహ్లీ అరుదైన ఘనత సాధించాడు. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 280 పరుగులు చేసింది. అనంతరం 281 పరుగుల లక్ష్యాన్ని మరో ఆరు బంతులు మిగిలుండగానే ఛేదించింది.

దీంతో మూడు వన్డేల సిరీస్లో పర్యాటక జట్టు శుభారంభం చేసింది. 281 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ జట్టు 49 ఓవర్లలో కేవలం 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించడం విశేషం. కివీస్ బ్యాట్స్మెన్లలో లాథమ్ (102 బంతుల్లో 103 నాటౌట్: 8 ఫోర్లు, 2 సిక్సర్లు), రాస్ టేలర్ (100 బంతుల్లో 95: 8 ఫోర్లు) పరుగులతో రాణించారు.
వీరిద్దరూ నాలుగో వికెట్కు డబుల్ సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు. 200వ వన్డేలో కోహ్లీ సెంచరీ చేసినప్పటికీ జట్టు మాత్రం ఓడిపోయింది. దీంతో 'విరాట్ కోహ్లీ బాగా ఆడావు!! కానీ మళ్లీ అది న్యూజిలాండే' అంటూ డీన్ జోన్స్ ఎగతాళిగా ట్వీట్ చేశాడు.
డీన్ జోన్స్ ట్వీట్పై భారత అభిమానులు మండిపడ్డారు. అతడికి చురకలంటిస్తూ ట్వీట్లు చేశారు. కివీస్ను చూసి ఆసీస్ క్రికెట్ ఆడటం నేర్చుకోవాలని అంటున్నారు. ఆసీస్ కన్నా కివీసే గట్టి జట్టు అని మరొక నెటిజన్ వ్యాఖ్యానించాడు. వారు గెలిచారు.. మీరు 4-1తో ఓడారు.. సాక్ష్యం కావాలంటే మళ్లీ రండి బాబూ అని ఓ నెటిజన్ పేర్కొన్నాడు.