
హైదరాబాద్: దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా సెంచూరియన్ వేదికగా భారత్ దక్షిణాఫ్రికాతో తలపడుతోంది. తొలి టెస్టులో పరాజయం చవిచూడగా 0-1తో భారత్ ఓటిమికి ఎదురీదుతోంది. ఇక రెండో టెస్టు కూడా నెగ్గితే కానీ, విజయాన్ని చేరుకోలేం. అనుకున్న సమయంలో కోహ్లీ సేన చాలా కష్టపడుతోంది. అయినా వారి కళ్ల ముందు భారీ లక్ష్యం ఉండగా పోరాడేందుకు మరింత కష్టపడే యోచనలో ఉంది.
మంగళవారం, నాలుగో రోజు 287 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్.. ఆట ముగిసే సమయానికి 35 పరుగులకే మూడు వికెట్లు చేజార్చుకుంది. కెప్టెన్ కోహ్లి (5) కూడా ఔట్ కావడం భారత్ ఆశలకు కోలుకోలేని దెబ్బ. పుజారా (11), పార్థివ్ పటేల్ (5) క్రీజులో ఉన్నారు.
షమీ ఇరగదీశాడు:
ఉదయం 90/2తో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన దక్షిణాఫ్రికా 258 పరుగులకు ఆలౌటైంది. మహ్మద్ షమి (4/49) ఆతిథ్య జట్టును కట్టడి చేయడంలో కీలక పాత్ర పోషించాడు. డివిలియర్స్ (80), ఎల్గర్ (61), డుప్లెసిస్ (48) రాణించారు. కోహ్లి అద్భుత శతకం (153; 217 బంతుల్లో 15×4)తో తొలి ఇన్నింగ్స్లో భారత్ 307 పరుగులు చేసింది.
గమ్యం 287, పిచ్ అనుకూలంగా లేదు:
విలువైన కోహ్లి వికెట్ సహా కీలకమైన మూడు వికెట్లు చేజార్చుకుంది. విజయ్ను ఔట్ చేయడం ద్వారా ఎనిమిదో ఓవర్లో భారత్ పతనాన్ని రబాడ (1/5) ఆరంభించాడు. తక్కువ ఎత్తులో వచ్చిన బంతిని విజయ్ (9) వికెట్ల మీదికి ఆడుకున్నాడు. ఆ తర్వాత ఎంగిడి రెండు వికెట్లతో భారత్ను గట్టి దెబ్బతీశాడు. రాహుల్ (4) మరోసారి పేలవ షాట్కు నిష్క్రమించాడు. ఎంగిడి (2/14) బంతిని కట్చేయబోయిన రాహుల్ నేరుగా బ్యాక్వర్డ్ పాయింట్లో మహారాజ్కు చిక్కాడు.
కోహ్లీ ఉంటే నమ్మకం:
క్రీజులో కోహ్లి ఉండుంటే ఐదో రోజు అవకాశాలు భిన్నంగా ఉండేవే. కానీ ఫామ్లో ఉన్న అతనిని కూడా ఎంగిడి ఎక్కువసేపు నిలువనివ్వలేదు. బంతి ఎక్కువ ఎత్తులో వస్తుందనుకొన్న కోహ్లీ ఎగిరి అడ్డంగా అడబోయాడు. అది కాస్త తక్కువ ఎత్తులో రావడంతో వికెట్ల ముందు దొరికిపోయాడు. సమీక్ష కోరినా ఫలితం లేకపోయింది. ఆ తర్వాత పుజారా, పార్థివ్ పటేల్ కష్టపడి మరో వికెట్ పడకుండా అడ్డుకున్నారు.
షమీ దిగ్భందనం:
భారత్ రెండో ఇన్నింగ్స్లో దక్షిణాఫ్రికాను 258 పరుగులకు కట్టడి చేయగలిగింది. దక్షిణాఫ్రికా ఓ దశలో 144/2తో అత్యంత పటిష్ట స్థితిలో నిలిచింది. కానీ షమి అద్భుత బౌలింగ్లో భారత్ను పోటీలోకి తెచ్చాడు. అతడు విజృంభించడంతో దక్షిణాఫ్రికా 19 పరుగుల వ్యవధిలో మూడు వికెట్లు చేజార్చుకుని 163/5కు చేరుకుంది. షమి వేసిన ఇన్నింగ్స్ 42వ ఓవర్లో ఎక్స్ట్రా బౌన్స్కు బోల్తాకోట్టిన డివిలియర్స్.. వికెట్కీపర్ చేతికి చిక్కాడు. డికాక్ (12)నూ వెనక్కి పంపాడు. డికాక్.. వికెట్కీపర్ పార్థివ్ చేతికి చిక్కాడు.
ఆ దశలో నిలిచిన డుప్లెసిస్.. ఫిలాండర్ (26)తో కలిసి జట్టు స్కోరు 200 దాటించాడు. ఓ దశలో దక్షిణాఫ్రికా 209/5తో నిలిచింది. ఐతే విజృంభించిన భారత బౌలర్లు 49 పరుగుల వ్యవధిలో మిగతా ఐదు వికెట్లు పడగొట్టారు.
నాయకుడే సైనికుడై:
భారత్ ఆఖరి రోజు వరకు పోటీలో నిలిచిందంటే అది కోహ్లి చలవే. చిరస్మరణీయ శతకంతో అతడు దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని 28 పరుగులకు పరిమితం చేశాడు. మిగతా బ్యాట్స్మెనంతా కలిసి చేసిన పరుగులకన్నా కోహ్లి ఒక్కడు చేసిన పరుగులే ఎక్కువ కావడం విశేషం. ఓవర్నైట్ 183/5తో మూడో రోజు, సోమవారం భారత్ తొలి ఇన్నింగ్స్ కొనసాగించగా.. కోహ్లి (ఓవర్నైట్ 85) త్వరగానే టెస్టుల్లో తన 21వ శతకాన్ని పూర్తి చేశాడు. ఎంగిడి వేసి ఇన్నింగ్స్ 65వ ఓవర్లో వరుసగా రెండు ఫోర్లు కొట్టిన కోహ్లి అతడి తర్వాతి ఓవర్లో ఓ డబుల్తో సెంచరీని పూర్తి చేశాడు. ఐతే వీలైనప్పుడల్లా బౌండరీ బాదిన కోహ్లికి అశ్విన్ మంచి సహకారం ఇవ్వడంతో ఇన్నింగ్స్ మళ్లీ కుదుటపడింది. అశ్విన్ (38; 54 బంతుల్లో 7×4) కూడా చక్కని స్ట్రోక్ప్లేను ప్రదర్శించాడు. రబాడ బౌలింగ్లో అతడు వరుసగా మూడు ఫోర్లు సాధించడం విశేషం.
పాండ్యా చేసిన తప్పు:
పరుగు తీయబోయి ఆగిన పాండ్యా మళ్లీ క్రీజుకు వెళ్లడంలో నిర్లక్ష్యం చూపించాడు. తాపీగా పరుగెత్తుతూ రనౌట్ అయిపోయాడు. పాండ్య (15) కాలు, బ్యాటు క్రీజుపైన గాల్లో ఉండగా ఫిలాండర్ త్రో వికెట్లను పడగొట్టింది. అప్పటికి స్కోరు 209. ఓ దశలో 280/6తో నిలిచిన భారత్.. దక్షిణాఫ్రికా స్కోరును దాటుతుందేమో అనిపించింది. కానీ 27 పరుగులకే భారత్ మిగతా నాలుగు వికెట్లు చేజార్చుకుంది. అశ్విన్ను ఔట్ చేయడం ద్వారా ఫిలాండర్.. 71 పరుగుల ఏడో వికెట్ భాగస్వామ్యానికి తెరదించాడు. షమి వెంటనే ఔటైనా.. కాసేపు నిలిచిన ఇషాంత్ (20 బంతుల్లో 3) సహకారంతో కోహ్లి జట్టు స్కోరును 300 దాటించాడు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్లో ఫాలో అవ్వండి.