
హైదరాబాద్: డర్బన్ వేదికగా దక్షిణాఫ్రికా-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన తొలి టెస్టులో ఆసీస్ వైస్ కెప్టెన్ డేవిడ్ వార్నర్, సఫారీ వికెట్ కీపర్ క్వింటన్ డీకాక్ల మధ్య జరిగిన మాటల దాడి అంతర్జాతీయ క్రికెట్లో కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే.
దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్ ఆడుతున్న క్రమంలో ఇచ్చిన టీ విరామ సమయంలో వీరిద్దరూ డ్రెస్పింగ్ రూమ్కి వెళ్లేటప్పుడు మెట్ల వద్ద తీవ్ర వాగ్వాదానికి దిగారు. సహచర ఆటగాళ్లు వద్దు అని వారిస్తున్నా వార్నర్ దూకుడు ప్రదర్శించాడు. ఈ సమయంలో వార్నర్ వెంట ఉస్మాన్ ఖవాజా, టిమ్ పైనీలు ఉన్నారు.
ఆ తర్వాత కాసేపటికి కెప్టెన్ స్మిత్ వచ్చి వార్నర్ను డ్రస్సింగ్ రూమ్లోకి తీసుకువెళ్లిపోయాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో మొత్తం కింగ్స్ మీడ్ స్టేడియంలో మెట్ల వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలో రికార్డు అయింది. ఈ వీడియోను స్థానిక మీడియా బయటపెట్టడంతో ఇప్పుడు చర్చనీయాంశమైంది.
దీంతో ఈ ఘటనను తీవ్రంగా పరిగణించి క్రికెట్ ఆస్ట్రేలియా విచారణకు ఆదేశించింది. గొడవ ఎలా మొదలైందో అనే విషయంపై విచారణ చేస్తున్నామని, నిజానిజాలు తెలిసేవరకూ ఎటువంటి నిర్ణయం తీసుకోబోమని క్రికెట్ ఆస్ట్రేలియా అధికారి ఒకరు తెలిపారు. తొలి టెస్టులో సఫారీలపై ఆతిథ్య ఆస్ట్రేలియా 118 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
దీంతో నాలుగు టెస్టు మ్యాచ్ల సిరిస్లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. మ్యాచ్ అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ ఈ గొడవపై స్పందించాడు. క్వింటన్ డికాక్.. డేవిడ్ వార్నర్ని వ్యక్తిగతంగా దూషించడం వల్లే గొడవ మొదలైందని స్మిత్ పేర్కొన్నాడు.
'మేము మైదానంలో దక్షిణాఫ్రికా ఆటగాళ్లతో చాలా సంతోషంగా ఉన్నాం. క్వింటన్తో మాకు ఎటువంటి గొడవ జరుగలేదు. కానీ డికాక్ మాత్రం అతని పరిథి దాటి మాట్లాడాడు. నా దృష్టిలో ఇది చాలా తప్పు. ఇప్పుడు ఇక నిర్ణయం అధికారుల చేతిలో ఉంది. మేం మాత్రం క్రీడాస్పూర్తిని పాటిస్తూ ఆడుతున్నాం' అని స్మిత్ అన్నాడు.