ఢిల్లీ క్యాపిటల్స్పై సన్రైజర్స్ హైదరాబాద్ ఉత్కంఠ విజయం సాధించింది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్లో మార్క్రమ్ సేన బ్యాటుతో అదరగొట్టింది. అలాగే డెత్ ఓవర్లలో కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి 9 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇది టోర్నీలో సన్రైజర్స్కు నాలుగవ విజయం.
అలాగే ఇది ఢిల్లీకి ఆరో ఓటమి. ఇప్పటి వరకు ఢిల్లీ కేవలం మూడు మ్యాచుల్లోనే గెలిచింది. ప్రస్తుతం ఐపీఎల్ పాయింట్ల పట్టికలో ఢిల్లీ చిట్టచివరి స్థానంలో ఉంది. రెండేళ్ల క్రితం వరకు సన్రైజర్స్ సారధిగా ఉన్న డేవిడ్ వార్నర్ కెప్టెన్సీలో ఢిల్లీ క్యాపిటల్స్ ఆడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే హైదరాబాద్లో ఈ రెండు జట్లు తలపడినప్పుడు కూడా ఫ్యాన్స్ ఎమోషనల్ అయ్యారు.

అయితే ఢిల్లీలో పరిస్థితి తారుమారైంది. ఈ మ్యాచ్ సందర్భంగా రెండు వర్గాలుగా చీలిపోయిన కొందరు అభిమానులు కొట్లాటకు తెగబడ్డారు. స్టేడియంలో మ్యాచ్ జరుగుతున్నప్పుడే ఇలా కొందరు ప్రేక్షకులు గొడవ పడ్డారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోలో నలుగురైదుగురు వ్యక్తులు గొడవ పడుతూ ఒకరిపై మరొకరు దెబ్బలు వేయడం కనిపిస్తోంది.
ఈ వీడియో చూసిన నెటిజన్లు జోకులు పేలుస్తున్నారు. ఈ రెండు జట్లు దాదాపుగా ప్లే ఆఫ్స్ రేసు నుంచి తప్పుకున్నాయని, అలాంటి టీమ్స్ విషయంలో గొడవపడి కొట్లాటకు దారి తీయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. అసలు ఇలా గొడవ పడే వాళ్లకు బుద్ధిలేదని మరికొందరు ఎగతాళి చేస్తున్నారు. ఏదేమైనా ఈ విజయంతో సన్రైజర్స్ ఒకడుగు ముందుకేసింది.
అయితే పాయిట్ల పట్టికలో టాప్ నాలుగు జట్ల వద్ద పదేసి పాయింట్లు ఉండగా.. ఈ విజయంతో సన్రైజర్స్ వద్ద 8 పాయింట్లు వచ్చాయి. అంటే మరో మ్యాచ్ గెలిస్తే సన్రైజర్స్ ఆ టాప్ నాలుగు జట్లతో సమానం అవుతుందన్నమాట. మరి మిగతా మ్యాచుల్లో సన్రైజర్స్ ఏమాత్రం రాణించి ప్లేఆఫ్స్ చేరుతుందేమ చూడాలి.