ఢిల్లీ క్యాపిటల్స్తో మరోసారి తలపడేందుకు సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు సిద్ధం అవుతోంది. చివరగా ఈ రెండు జట్లు తలపడినప్పుడు బ్యాటింగ్ వైఫల్యం కారణంగా సన్రైజర్స్ ఓడిపోయింది. ఈ క్రమంలో ఆ ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని సన్రైజర్స్ భావిస్తోంది. అయితే ఈ మ్యాచ్కు ముందు సన్రైజర్స్కు గట్టి షాక్ తగిలింది.
కీలకమైన ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ గాయంతో ఐపీఎల్కు దూరమయ్యాడు. ఈ సీజన్లో సుందర్ 60 పరుగులు చేసి, మూడు వికెట్లు తీసుకున్నాడు. అతను ఆడిన చివరి మ్యాచ్లో ఫామ్లోకి వచ్చినట్లే కనిపించాడు. అలాంటి సమయంలో జట్టుకు దూరం అవడం అభిమానులకు కూడా గట్టి షాకిచ్చింది. ఈ విషయంపై సన్రైజర్స్ కెప్టెన్ ఎయిడెన్ మార్క్రమ్ కూడా స్పందించాడు.

'వాషింగ్టన్ స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారనే విషయంలో నాక్కూడా క్లారిటీ లేదు. కానీ అతను లేకపోవడం చాలా పెద్ద లోటు. అతని క్వాలిటీ, ఎక్స్పీరియన్స్ ఎంతో విలువైనవి. అలాంటి ఆటగాడి స్థానాన్ని భర్తీ చేయడం అంత ఈజీ కాదు. అయితే ప్రస్తుతం మా దగ్గర ఉన్న ఆటగాళ్లపై నమ్మకం ఉంచడం కూడా ముఖ్యమే. వాళ్లకు కూడా సరైన అవకాశాలు ఇవ్వాలి' అని మార్క్రమ్ అభిప్రాయపడ్డాడు.
ప్రస్తుతం ఐపీఎల్ పాయింట్ల పట్టికలో సన్రైజర్స్ 9వ స్థానంలో ఉంది. ఇప్పటి వరకు ఆడిన ఏడు మ్యాచుల్లో ఐదింట ఓడిపోయింది. బ్యాటింగ్ ఆర్డర్లో రకరకాల మార్పులు చేయడం కూడా ఆ జట్టుకు కలిసిరాలేదు. దీనిపై మాట్లాడిన మార్క్రమ్.. 'ఈ మార్పులు చేర్పులు చేయడం కఠినమైన నిర్ణయమే. ఎవరిని ఎక్కడ ఆడించాలో కరెక్ట్గా డిసైడ్ అవడానికే మేం కూడా ట్రై చేస్తున్నాం. ఈ విషయంలో ఎంత త్వరగా ఒక నిర్ణయానికి వస్తే ఫలితాలు అంత త్వరగా వస్తాయి' అన్నాడు.
సన్రైజర్స్ బ్యాటింగ్ వైఫల్యం వల్లనే ఇన్ని మ్యాచులు ఓడింది. లేదంటే చెన్నై సూపర్ కింగ్స్పై కూడా సన్రైజర్స్ గెలవాల్సింది. ఇలా బ్యాటింగ్ విఫలం అవడాన్ని మార్క్రమ్ కూడా అంగీకరించాడు. 'బ్యాటింగే మా సమస్య. ముఖ్యంగా ఆటగాళ్ల మైండ్ సెట్, ఆటలో వాళ్ల మెంటల్ అప్రోచ్ సమస్య అని అనుకుంటున్నా. మా వాళ్లు స్వేచ్ఛగా ఆడేలా చేసేందుకు మేం ప్రయత్నిస్తున్నాం. కానీ దురదృష్టవశాత్తూ మా ఆటగాళ్లు ఇంకా పూర్తిగా స్వేచ్ఛగా ఆడటం లేదు' అని మార్క్రమ్ వివరించాడు.