ఢిల్లీపై పంజాబ్ అద్భుతమైన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్.. ఇన్నింగ్స్ ఆరంభంలోనే వెంట వెంటనే మూడు వికెట్లు కోల్పోయింది. దీంతో ఆ జట్టు మంచి స్కోరు చేయడం అసాధ్యంగా కనిపించింది. అలాంటి సమయంలో యువ ఓపెనర్ ప్రభ్సిమ్రాన్ సింగ్ సెంచరీతో చెలరేగాడు. పంజాబ్కు పోరాడే స్కోరు అందించాడు.
లక్ష్య ఛేదనను ఢిల్లీ కూడా అద్భుతంగానే ఆరంభించింది. డేవిడ్ వార్నర్ (54) ధనాధన్ ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. అయితే మిగతా బ్యాటర్లలో ఒక్కరు కూడా రాణించలేదు. మంచి ఫామ్లో ఉన్న అక్షర్ పటేల్ (1) కూడా దారుణంగా విఫలమయ్యాడు. దీంతో ఆలౌట్ అవకుండా ఉండేందుకు ఆ జట్టు ప్రయత్నించింది.

ఈ క్రమంలోనే నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 136 పరుగులు మాత్రమే చేయగలిగింది. పంజాబ్ బౌలర్లలో హర్ప్రీత్ బ్రార్ నాలుగు వికెట్లతో చెలరేగాడు. రాహుల్ చాహర్, నాథన్ ఎల్లీస్ చెరో రెండు వికెట్లతో ఆకట్టుకున్నారు. ఈ విజయంలో పంజాబ్ ప్లేఆఫ్స్ ఆశలు సజీవంగా మిగిలాయి. ఈ విజయంపై పంజాబ్ కెప్టెన్ శిఖర్ ధవన్ స్పందించాడు.
'మా బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. వాళ్లే మమ్మల్ని పోటీలోకి తీసుకొచ్చారు. మా స్పిన్నర్లు, ఫాస్ట్ బౌలర్లకు ఈ క్రెడిట్ అంతా దక్కాలి. నాలుగో ఓవర్ నుంచే ఈ పిచ్పై బంతి టర్న్ అవుతోంది. అలాంటి పిచ్పై ప్రభ్సిమ్రాన్ అత్యద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. అతని ఇన్నింగ్స్ వల్లనే మేం ఆ మాత్రం స్కోరు చేయగలిగాం' అని మెచ్చుకున్నాడు.
'నేను హర్ప్రీత్కు స్లోగా బౌలింగ్ చేస్తూ వికెట్లను టార్గెట్ చేయాలని చెప్పా. అతను ఆ పరిస్థితిని అడాప్ట్ చేసుకొని వికెట్లు తీయడం.. ముఖ్యంగా లెఫ్ట్ హ్యాండర్లను అవుట్ చేసిన తీరు సూపర్. కుర్రాళ్లతో కలిసి ఉన్నప్పుడు నేను కూడా కుర్రాడిలా మారడానికి ట్రై చేస్తుంటా. మా కుర్రాళ్లు బాధ్యత తీసుకొని మంచి మెచ్యూరిటీతో ఆడటం చూస్తే చాలా సంతోషంగా ఉంది' అని ధవన్ చెప్పుకొచ్చాడు.
'మా కుర్రాళ్లు ఎదుగుతున్న తీరు చూస్తే చాలా ఆనందంగా ఉంది. ఈ విజయంతో మా జట్టులో చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లోనే మేం కామ్గా ఉండాలి. మరీ ఎగ్జయిట్ అయిపోకూడదు. అలా కామ్గా ఉండటం మాకు కలిసొచ్చింది. మిగతా మ్యాచుల్లో కూడా ఇలాగే రాణించాల్సిన అవసరం ఉంది' అని ధవన్ పేర్కొన్నాడు. పంజాబ్ జట్టు తమ తర్వాతి మ్యాచ్లో కూడా ఢిల్లీనే ఎదుర్కోనుంది.