పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ చిత్తుగా ఓడింది. పిచ్ నుంచి స్పిన్నర్లకు సహకారం అందుతున్న నేపథ్యంలో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ బ్యాటర్లు తడబడ్డారు. అయితే యువ ఓపెనర్ ప్రభ్సిమ్రాన్ సింగ్ (103) అద్భుతమైన ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. అతని సెంచరీతో పంజాబ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 167 పరుగులు చేయగలిగింది.
ఓ మోస్తరు లక్ష్య ఛేదనను డేవిడ్ వార్నర్ (54) అద్భుతంగా ప్రారంభించాడు. ఎడాపెడా బౌండరీలు బాదేస్తూ చెలరేగాడు. అయితే అతనికి అవతలి ఎండ్ నుంచి సరైన సహకారం లభించలేదు. వచ్చిన బ్యాటర్ వచ్చినట్లే పెవిలియన్ చేరారు. ముఖ్యంగా పంజాబ్ స్పిన్నర్లు రంగంలోకి దిగడంతో ఢిల్లీ బ్యాటింగ్ లైనప్ తేలిపోయింది.

చివరకు సూపర్ ఫామ్లో ఉన్న అక్షర్ పటేల్ (1) కూడా విఫలమయ్యాడు. ఇలా ఒక్కొక్కరే పెవిలియన్కు క్యూ కట్టడంతో ఢిల్లీ ఓటమి దాదాపు ఖరారైంది. అయితే అమన్ హకీం ఖాన్ (16), కొత్త కుర్రాడు ప్రవీణ్ దూబే (16) క్రీజులో ఉండటంతో ఢిల్లీ అభిమానులకు కొంత ఆశలు మిగిలాయి. కానీ వాళ్లిద్దరూ అనుకున్నంత వేగంగా బ్యాటింగ్ చేయలేకపోయారు.
ఇన్నింగ్స్ వేగం పెంచే క్రమంలో ఇద్దరూ పెవిలియన్ చేరారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో ఆ జట్టు 8 వికెట్ల నష్టానికి 136 పరుగులే చేయగలిగింది. యువ స్పిన్నర్ హర్ప్రీత్ బ్రార్ నాలుగు వికెట్లతో చెలరేగగా.. రాహుల్ చాహర్, నాథన్ ఎల్లీస్ చెరో రెండు వికెట్లు తీసుకున్నారు. ఈ ఓటమిపై ఢిల్లీ సారధి డేవిడ్ వార్నర్ స్పందించాడు. ప్రత్యర్థిని అనుకున్న లక్ష్యానికి కట్టడి చేయలేకపోయామని అభిప్రాయపడ్డాడు.
'మేం అనుకున్న దాని కన్నా పంజాబ్ ఎక్కువ పరుగులు చేసింది. ప్రభ్సిమ్రాన్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. జారవిడిచిన క్యాచులకు మేం భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. ఎప్పుడైనా సరే పవర్ప్లే ముగిసే సరికి 30/6 స్కోరుతో ఉంటే అలాంటి మ్యాచులు గెలవడం దాదాపు అసాధ్యం. ఇక మిగతా మ్యాచుల్లో పరువు నిలుపుకోవడానికి స్వేచ్ఛగా ఆడేందుకు ప్రయత్నిస్తాం' అని తెలిపాడు.
'మంచి ఆరంభం లభించడంతో సంతోషంగా ఫీలయ్యా. కానీ ఆ తర్వాత మా బ్యాటింగ్ ఘోరంగా ఫెయిలైంది. జట్టు ఇలా వరుసగా ఓడిపోతూ ఉంటే.. మార్పులు చేయక ఏం చేస్తాం. ఇప్పుడిప్పుడే మాకు సరైన కాంబినేషన్ దొరికింది అనుకుంటున్నాం. కానీ మూడు నాలుగు వికెట్లు టపటపా పడిపోతే ఆ తర్వాత చెయ్యడానికి ఏం ఉండదు' అని పేర్కొన్నాడు. ఢిల్లీ జట్టు తన తర్వాతి మ్యాచ్లో మరోసారి పంజాబ్నే ఎదుర్కొంటుంది.