ఐపీఎల్ 2023 ప్లేఆఫ్స్ రేసులో పంజాబ్ కింగ్స్ నిలవాలంటే ఢిల్లీతో జరిగే మ్యాచ్లో కచ్చితంగా గెలిచి తీరాలి. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరిగే ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారని చెప్పడం చాలా కష్టం. ఎందుకంటే ఇటీవలి కాలంలో ఢిల్లీ క్యాపిటల్స్ మంచి జోరు మీద ఉంది. ముఖ్యంగా ఆ జట్టు టాప్-4 ఆటగాళ్లు అదరగొడుతున్నారు.
తను ఆడిన చివరి ఐదు మ్యాచుల్లో వరుసగా నాలుగింట ఢిల్లీ గెలిచింది. అలాగే పంజాబ్పై కూడా ఢిల్లీ రికార్డు మెరుగ్గా ఉంది. ఈ రెండు జట్లు తలపడిన చివరి నాలుగు మ్యాచుల్లో ఢిల్లీనే గెలిచింది. దీంతో ఢిల్లీకి ఈ మ్యాచ్ గెలిచే అవకాశాలు కూడా బాగానే ఉన్నాయి. అయితే పంజాబ్ కూడా ఈసారి కొంత బలంగానే కనిపిస్తోంది.

పంజాబ్కు ప్రధాన సమస్య ఆ జట్టు స్పిన్ బౌలింగ్ విభాగమే. రాహుల్ చాహర్ ఈ సీజన్లో పెద్దగా ప్రభావం చూపలేదు. అలాగే నాలుగో విదేశీ ప్లేయర్ స్థానం కోసం భానుక రాజపక్స, సికందర్ రజా, మాథ్యూ షార్ట్ పోటీ పడుతున్నారు. వీరు ముగ్గుర్నీ ధవన్ టీం ఒకరి తర్వాత ఒకరిని ఆడిస్తూ వస్తోంది.
శామ్ కర్రాన్, లియామ్ లివింగ్స్టోన్ వంటి వాళ్లు మంచి ఇన్నింగ్స్ ఆడాల్సి ఉంది. లివింగ్స్టోన్ ఇప్పుడిప్పుడే ఫామ్లోకి వస్తున్నట్లు కనిపిస్తున్నాడు. కర్రాన్ ఇంకా తన ధరకు న్యాయం చేయలేదనే చెప్పాలి. కుర్ర ఓపెనర్ ప్రభ్సిమ్రాన్ సింగ్ కూడా నిలకడగా రాణించడం లేదు. ధవన్ ఒక్కడే టాపార్డర్లో శ్రమిస్తున్నాడు.
ఢిల్లీ జట్టు మరీ ఎక్కువగా టాప్-4 బ్యాటర్లపైనే ఆధార పడుతోంది. మిడిలార్డర్ చాలా పేలవంగా ఉంది. ఇక అక్షర్ పటేల్ను ఏడో స్థానంలో దింపుతూ అతని బ్యాటింగ్ను ఆ టీం సరిగా ఉపయోగించుకోవడం లేదు. కాబట్టి పేపర్ మీద పంజాబ్ గెలిచే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కానీ ప్రస్తుత మొమెంటం చూస్తే మాత్రం ఢిల్లీనే గెలిచేలా ఉంది. అది కూడా సొంత మైదానంలో మ్యాచ్ జరగడం ఆ జట్టుకు ఇంకా కలిసొస్తుంది.