ఐపీఎల్లో ఇప్పటి వరకు విజయం లేని జట్టు ఢిల్లీ క్యాపిటల్స్. ఇప్పుడు సొంత మైదానంలో కోల్కతా నైట్ రైడర్స్ను ఎదుర్కొనేందుకు రెడీ అవుతోంది. కేకేఆర్ తను ఆడిన ఐదు మ్యాచుల్లో రెండింట విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే ఈ జట్టు పరిస్థితి కూడా అంత గొప్పగా ఏం లేదు. గెలిచిన రెండు మ్యాచులూ కూడా ఇద్దరు ఆటగాళ్ల వల్ల గెలిచినవే.
ఒక జట్టుగా కేకేఆర్ పెద్దగా రాణించడం లేదు. ఆర్సీబీపై శార్దూల్ ఠాకూర్ వల్ల గెలిస్తే.. గుజరాత్ టైటాన్స్పై రింకూ సింగ్ హీరోయిక్ ఇన్నింగ్స్ వల్ల గెలిచింది. ఢిల్లీపై ఇలా గెలవడం కేకేఆర్కు కష్టమే. ఎందుకంటే ఆ జట్టు బౌలింగ్ ఎటాక్ చాలా బాగుంది. మిచెల్ మార్ష్, ముఖేష్ కుమార్, ముస్తాఫిజుర్ వంటి బౌలర్లు ఢిల్లీ సొంతం. అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ రూపంలో మంచి స్పిన్నర్లు కూడా ఉన్నారు.

కాబట్టి ఎవరో ఒకరిపై ఆధారపడి ఈ మ్యాచ్లో కేకేఆర్ గెలవాలి అనుకుంటే అది అసాధ్యమే అని చెప్పాలి. దానికితోడు కేకేఆర్ బౌలింగ్ పెద్ద బలంగా లేదు. ఉమేష్ యాదవ్, లోకీ ఫెర్గూసన్, శార్దూల్ ఠాకూర్, ఆండ్రీ రస్సెల్ ఎవరూ కూడా బంతితో పెద్దగా రాణించడం లేదు. కేవలం సూయష్ శర్మ, వరుణ్ చక్రవర్తి, సునీల్ నరైన్ మీదనే ఆ జట్టు బౌలింగ్ భారం పడుతోంది. ఈ విషయంలో ఢిల్లీ కొంచెం తడబడుతుందనే చెప్పాలి.
ఢిల్లీ బ్యాటింగ్ చాలా పేలవంగా ఉంది. వార్నర్, పృథ్వీ షా ఇద్దరూ పెద్దగా ఆడటం లేదు. వార్నర్ అయితే మరీ జిడ్డుగా ఆడుతూ తలనొప్పి తెప్పిస్తున్నాడు. మిడిలార్డర్లో కూడా నిలకడగా ఆడటం వారి వల్ల కావడం లేదు. అక్షర్ పటేల్ను ప్రమోట్ చేసి కొంచెం ముందు పంపేందుకు డీసీ ససేమిరా అంటోంది. ఇది కూడా ఆ జట్టు విజయాలపై ప్రభావం చూపించే అంశమే.
అయితే కాగితం మీద ఢిల్లీ చాలా బలంగా కనిపిస్తోంది. వరుసగా ఐదు మ్యాచుల పరాజయం తర్వాత ఆ జట్టులో ఇద్దరు, ముగ్గురు బ్యాటర్లు ఫామ్ అందుకున్నా ఢిల్లీని ఓడించడం కష్టమే. కాబట్టి ఈ మ్యాచ్లో ఢిల్లీ బోణీ కొట్టే అవకాశాలు చాలానే ఉన్నాయి. అదే సమయంలో మరోసారి ఎవరో ఒకరు అద్భుతంగా రాణించి కేకేఆర్ను గెలిపించినా ఆశ్చర్యం లేదు.