ఐపీఎల్ 2023లో మరో హైఓల్టేజ్ మ్యాచ్కు అంతా సిద్ధమైంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్, డిఫెండింగ్ ఛాంపియన్స్ గుజరాత్ టైటాన్స్ తలపడేందుకు రెడీ అవుతున్నాయి. అయితే ఈ రెండు జట్లు ఈ సీజన్లో తమ ఓపెనింగ్ గేమ్స్లో వేరు వేరు ఫలితాలు చూశాయి. డిఫెండింగ్ ఛాంపియన్స్ గుజరాత్ టైటాన్స్ తమ ప్లాన్స్ అన్నింటినీ సరిగా అమలు చేసి, నాలుగు సార్లు ట్రోఫీ నెగ్గిన చెన్నై సూపర్ కింగ్స్ను ఓడించింది.
అదే సమయంలో ఢిల్లీ క్యాపిటల్స్ మాత్రం అన్నీ పొరపాట్లే చేసింది. తాము అనుకున్న ఒక్క విషయంలో కూడా కాన్ఫిడెన్స్ చూపించలేకపోయింది. అందుకే లక్నో సూపర్ జెయింట్స్తో జరిగిన తమ మొదటి మ్యాచులో ఢిల్లీ ఘోరంగా ఓడింది. ఛేజింగ్కు వచ్చిన ఢిల్లీ.. ఓపెనర్లు, మిడిలార్డర్ తడబడటంతో మధ్యలోనే చేతులెత్తేసింది. దీంతో లక్నో జట్టు ఏకంగా 50 పరుగుల తేడాతో ఈ మ్యాచ్ నెగ్గింది. ఢిల్లీ చిత్తుగా ఓడింది.

సీజన్ ఓపెనర్లో చాలా కంఫర్టబుల్గా కనిపించిన గుజరాత్ టైటాన్స్ జట్టు.. ఈ మ్యాచులో మరింత బలంగా కనిపిస్తోంది. ఎందుకంటే వాళ్ల కీలక ప్లేయర్, సౌతాఫ్రికా స్టార్ డేవిడ్ మిల్లర్ ఆ జట్టుతో కలుస్తున్నాడు. దీంతో గుజరాత్ బ్యాటింగ్ మరింత బలంగా మారుతోంది. ఇక చివర్లో ఫినిషర్లుగా రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్ ఉండనే ఉన్నారు. ఇలా చూసుకుంటే గుజరాత్ టైటాన్స్ చాలా బలంగా కనిపిస్తోంది. ఢిల్లీపై కూడా గెలిచి తమ సీజన్ను వరుస విజయాలతో ఆరంభించాలని గుజరాత్ భావిస్తోంది.
తమ తొలి మ్యాచ్లో మార్క్ వుడ్ పేస్ బౌలింగ్కు దాసోహమన్న ఢిల్లీ క్యాపిటల్స్.. ఈసారి తాము కూడా ఒక ఎక్స్ప్రెస్ పేసర్తో బరిలో దిగేందుకు డీసీ రెడీ అవుతోంది. సఫారీ పేసర్ ఆన్రిచ్ నోర్యీ ఈ జట్టుతో కలుస్తున్నాడు. దీంతో డీసీ బౌలింగ్ విభాగం మరింత బలంగా మారుతోంది. ఓపెనర్లు కనుక రాణిస్తే డీసీ ఎలాంటి జట్టుపై అయినా గెలిచే సత్తా ఉన్న జట్టే. మరి ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారో చూడాలి. నిపుణుల అంచనా ప్రకారం, ఈ మ్యాచ్లో గెలిచే ఫేవరెట్ గుజరాత్ టైటాన్స్. మరి ఫలితం ఎలా ఉంటుందో తెలియాలంటే వేచి చూడక తప్పదు.