DC vs RR: ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన ఉత్కంఠభరితమైన మ్యాచ్ సూపర్ ఓవర్కు దారితీసింది. మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 188 పరుగులు చేయగా, రాజస్థాన్ కూడా 188 పరుగులు మాత్రమే చేయగలిగింది. సూపర్ ఓవర్లో రాజస్థాన్ 11 పరుగులు చేసింది, ఢిల్లీ నాలుగు బంతుల్లోనే లక్ష్యాన్ని సాధించి ఐపీఎల్ లో ఐదో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఈ విజయంతో ఢిల్లీ జట్టు అగ్రస్థానానికి చేరుకుంది. అయితే సూపర్ ఓవర్ ద్వారా మ్యాచ్ విజేతను నిర్ణయించడం అనేది నాలుగేళ్ల అనంతరం ఇదే తొలిసారి. ఈ సూపర్ ఓవర్లో ఢిల్లీ క్యాపిటల్స్ ను విజేతంగా నిలపడంలో ఢిల్లీ బౌలర్ మిచెల్ స్టార్క్ కీలక పాత్ర పోషించాడు. రాజస్థాన్ ఇన్నింగ్స్ చివరి ఓవర్ తో పాటు సూపర్ ఓవర్లోనూ అద్భుతంగా బౌలింగ్ చేసి ఢిల్లీకి సూపర్ విక్టరీని అందించాడు. సూపర్ ఓవర్ లో తడబడిన రాజస్థాన్ రాయల్స్ జట్టు పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చింది.
ఐపీఎల్ 2025లో భాగంగా ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంగా వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్ , రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. టాస్ గెలిచిన రాజస్థాన్ జట్టు బౌలింగ్ ఎంచుకుని ఢిల్లీ క్యాపిటల్స్ జట్టును బ్యాటింగ్ కు ఆహ్వానించింది. ఢిల్లీ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. రాజస్థాన్ రాయల్స్ కు 189 పరుగుల లక్ష్యాన్ని ముందు ఉంచింది. ఓపెనర్ అభిషేక్ పోరెల్ 37 బంతుల్లో 49 పరుగులు చేసి ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఢిల్లీ జట్టు తరపున అభిషేక్ పోరెల్ తో పాటు కేఎల్ రాహుల్ (38), అక్షర్ పటేల్(34), ట్రిస్టన్ స్టబ్స్(34*), అశుతోష్ శర్మ(15*) రాణించారు. ఇదిలా ఉండగా మొదట్లో దూకుడుగా ఆడిన ఢిల్లీ క్యాపిటల్స్ అనంతరం వికెట్లు పడిపోవడంతో నెమ్మదిగా ఆడింది. గత మ్యాచ్ లో అద్భుతంగా ఆడిన కరుణ్ నాయర్.. ఈ మ్యాచ్ లో ఒక్క పరుగు చేయకుండానే రనౌట్ గా వెనుదిరిగాడు. కానీ చివరి 5 ఓవర్లలో ఢిల్లీ క్యాపిటల్స్ ఒక వికెట్ మాత్రమే కోల్పోయి 77 పరుగులు చేసింది. రాజస్థాన్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్ 2 వికెట్లు పడగొట్టగా.. మహీశ్ తీక్షణ, వనిందు హసరంగా తలో వికెట్ తీశారు.

189 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్లు సంజూ శాంసన్(31 రిటైర్డ్ హర్ట్), యశస్వి జైస్వాల్(51) మంచి ఆరంభాన్ని అందించారు. గాయం కారణంగా సంజు శాంసన్ పెవిలియన్ చేరడంతో క్రీజులోకి వచ్చిన రియాన్ పరాగ్(8) అంతగా రాణించలేకపోయాడు. అనంతరం వచ్చిన నితీష్ రాణా(51) హాఫ్ సెంచరీతో అద్భుతంగా రాణించాడు. నితీష్ రాణా తర్వాత ధ్రువ్ జురెల్(26) చివరి వరకు క్రీజులో నిలిచి రాజస్థాన్ ను గెలిపించేందుకు ప్రయత్నించాడు. కానీ చివరి ఓవర్లో 9 పరుగులు అవసరమైన సమయంలో మిచెల్ స్టార్క్ అద్భుతంగా బౌలింగ్ చేసి కేవలం 8 పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఈ క్రమంలో మ్యాచ్ టైగా ముగిసింది. దీంతో సూపర్ ఓవర్ అనివార్యమైంది.
సూపర్ ఓవర్లో ఢిల్లీ తరపున మిచెల్ స్టార్క్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. నాలుగు బంతులు మాత్రమే ఆడిన రాజస్థాన్ రాయల్స్ 11 పరుగులు చేసి 2 వికెట్లు కోల్పోయింది. సూపర్ ఓవర్ లో 2 వికెట్లు కోల్పోతే తర్వాత ఆడే అవకాశం ఉండదు. 12 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ కేవలం 4 బంతుల్లోనే విజయాన్ని సాధించింది. ఢిల్లీ బ్యాటర్లు(7), స్టబ్స్(6) సూపర్ ఓవర్లో రాణించారు.