DC VS RCB: ఐపీఎల్ 2025లో భాగంగా దిల్లీ అరుణ్ జెట్లీ స్టేడియం వేదికగా తాజాగా జరిగిన కీలక మ్యాచులో దిల్లీ క్యాపిటల్స్ పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అద్భుత విజయం సాధించి ప్రతీకారం తీర్చుకుంది. 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఆల్ రౌండ్ ప్రదర్శనతో ఆర్సీబీ అదరగొట్టింది. విజయంలో బ్యాటుతో కోహ్లీ(51), కృనాల్ పాండ్య (73), బంతితో భువనేశ్వర్ కుమార్, హెజిల్ వుడ్ కీలకంగా వ్యవహరించారు. కాగా, రీసెంట్ గా ఈ రెండు జట్ల మధ్య చిన్నస్వామి స్టేడియంలో జరిగిన మ్యాచులో దిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇకపోతే ఈ విజయంతో ఆర్సీబీ ప్లే ఆఫ్స్కు మరింత చేరువైంది. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లింది. ఈ సీజన్ లో ఆర్సీబీకి ఇది ఏడో విజయం.
163 పరుగుల లక్ష్య ఛేదనను ఆర్సీబీ 18.3 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. 165 రన్స్ చేసింది. ఛేదనలో ఆర్సీబీకి మంచి ఆరంభం దక్కలేదు. జకోబ్ బెథెల్ (6 బంతుల్లో 12 1 ఫోర్ల, 1 సిక్స్ ) దూకుడుగా ఆడి త్వరగా పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత దేవదత్ పడిక్కల్ (0), రజత్ పటీదార్ (6) విఫలమయ్యారు. కానీ విరాట్ కోహ్లీ (47 బంతుల్లో 4 ఫోర్ల సాయంతో 51 పరుగులు), కృనాల్ పాండ్య (47 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్సుల సాయంతో 73 రన్స్) హాఫ్ సెంచరీలతో మెరిశారు. ఈ సీజన్ లో కోహ్లీకి ఇది ఆరో అర్ధ శతకం కావడం విశేషం. ఆఖర్లో టిమ్ డేవిడ్ (5 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్ సాయంతో 19 పరుగులు) మెరుపులు మెరిపించాడు. అక్సర్ పటేల్ 2 వికెట్లు తీయగా.. దష్మంత్ చమీర ఓ వికెట్ పడగొట్టాడు.
