MI VS DC: ఐపీఎల్ 2025లో ముంబై ఇండియన్స్ ఎట్టకేలకు విజయం సాధించింది. ఇప్పటివరకు ఆరు మ్యాచులు ఆడగా.. ఇది ఎంఐకు రెండో విజయం. అయితే ఈ విజయంలో బంతిని మార్చడం కీలకంగా వ్యవహరించింది. మరి అలా మ్యాచ్ మధ్యలో బంతిని మార్చొచ్చా?, అసలు రూల్స్ ఏం చెబుతున్నాయి? ముంబయి ఎందుకు బంతిని మార్చాలి వచ్చింది? ఇప్పుడు తెలుసుకుందాం..
అందుకే బంతి మార్పు..
ఈ మ్యాచు లక్ష్య ఛేదనలో.. దిల్లీ క్యాపిటల్స్ ప్లేయర్ కరుణ్ నాయర్ అద్భుతంగా రాణించాడు. దీంతో దిల్లీ విజయం ముంగిట వరకు వెళ్లింది. ఈ క్రమంలోనే మైదానంలో మంచు పడటం ప్రారంభమైంది. దీంతో ముంబయి ఇండియన్స్.. 13వ ఓవర్ ముగిసిన తర్వాత మరో బంతిని తీసుకుని బౌలింగ్ చేసింది. ఆ బంతికి మంచి గ్రిప్ దొరకడం వల్ల, కర్ణ్ శర్మ దానిని అనుకూలంగా మార్చుకున్నాడు.
ఆ తర్వాతి ఓవర్లోనే కర్ణ్.. ట్రిస్టన్ స్టబ్స్ను పెవిలియన్ పంపాడు. అనంతరం వెంటనే కేఎల్ రాహుల్ ను ఔట్ చేసి మ్యాచును ముంబై వైపునకు తిప్పాడు. అప్పటికే కర్ణ్.. అభిషేక్ పోరెల్ వికెట్ తీశాడు. అలా
ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చిన కర్ణ్ శర్మ (3/36)తో గొప్పగా బౌలింగ్ చేసి.. ముంబయి విజయంలో కీలక పాత్ర పోషించాడు.
మరి రూల్ ఏం చెబుతోంది?
కొత్త ఐపీఎల్ రూల్ ప్రకారం.. రాత్రి పూట జరిగే మ్యాచులో రెండో ఇన్నింగ్స్ లో ఫీల్డింగ్ టీమ్ కెప్టెన్ కు బంతిని మార్చుకునే అవకాశం ఉంటుంది. మంచు కారణంగా లేదా బంతి షేప్ ఔట్ కారణంగా పట్టు కోల్పోతున్న సమయంలో (11 ఓవర్ల తర్వాత) బాల్ ను మార్చుకోవచ్చు. అయితే ముందుగా ఫీల్డ్ అంపైర్ కు రిక్వెస్ట్ పంపాలి. దానికి అంపైర్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే.. కొత్త బంతిని తీసుకోవచ్చు.
రోహిత్ మాస్టర్ మైండ్..
రోహిత్ మరోసారి తన నాయకత్వ లక్షణాలను మైదానం బయట నుంచి నిరూపించాడు. బంతి మార్చాలని, స్పిన్ బౌలింగ్ వేయాలని కెప్టెన్ హార్దిక్ పాండ్యకు, కర్ణ్ కు సూచించాడు. దాన్ని వెంటనే అమలు చేయగానే ఢిల్లీ ఇన్నింగ్స్ కుదేలైంది. స్పిన్నర్లు అద్భుతంగా రాణించి ఢిల్లీని ఒత్తిడిలోకి నెట్టేశారు. దీనికి సంబంధించిన వీడియోను బ్రాడ్ కాస్టర్లు రిలీజ్ చేశారు. ముందుగా రోహిత్ శర్మ, బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రే, హెడ్ కోచ్ కుమార సంగక్కర.. కలిసి ఈ వ్యూహంపై చర్చించినట్లు వీడియోలో కనిపించింది. ఆ తర్వాత రోహిత్ తన సూచనలను మైదానంలోకి పంపించాడు. దీంతో రోహిత్ అనుభవం జట్టుకు ఎంత ముఖ్యమో మరోసారి రుజువైంది. తాను ఆటలో లేకపోయినా జట్టుకు ఎలా మద్దతుగా నిలుస్తున్నాడో ఇది స్పష్టంగా తెలియజేసింది.
