ముంబై ఇండియన్స్ నయా కెప్టెన్ హార్దిక్ పాండ్య తమ జట్టు సభ్యులపై నోరుపారేసుకున్నాడు. కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక తమ ఆటగాళ్లపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ అరిచాడు. అరుణ్ జైట్లీ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్తో జరుగుతున్న మ్యాచ్లో ఈ ఘటన జరిగింది.
టాస్ ఓడి బ్యాటింగ్కు వచ్చిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లకు 257 పరుగుల భారీ స్కోరు చేసింది. ఐపీఎల్ చరిత్రలో ఢిల్లీకి ఇదే అత్యధిక స్కోరు. జేక్ ఫ్రేజర్ మెక్గుర్క్ (84; 27 బంతుల్లో, 11x4, 6x6) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ట్రిస్టన్ స్టబ్స్ (48*; 25 బంతుల్లో, 6x4, 2x6), షై హోప్ (41; 17 బంతుల్లో, 5x6) సత్తాచాటారు. ముంబై బౌలర్లలో బుమ్రా (1/35) మినహా మిగిలినందరూ ధారాళంగా పరుగులు ఇచ్చారు.

ఇన్నింగ్స్ ఆరంభం నుంచి ముంబై బౌలర్లపై ఫ్రేజర్ విరుచుకుపడ్డాడు. తొలి ఓవర్ నుంచే బాదడం ప్రారంభించాడు. ల్యూక్ వుడ్ బౌలింగ్లో మూడు ఫోర్లు, ఓ సిక్సర్ బాది మొదటి ఓవర్లో 19 పరుగులు రాబట్టుకున్నాడు. బుమ్రాను కూడా ఫ్రేజర్ వదిలిపెట్టలేదు. రెండు ఫోర్లు, ఓ సిక్సర్తో 18 పరుగులు పిండుకున్నాడు. ఫ్రేజర్ ధాటికి నువాన్ తుషార 18, హార్దిక్ పాండ్య 20 పరుగులు సమర్పించుకున్నారు.
ఢిల్లీ క్యాపిటల్స్ పవర్ప్లేలో వికెట్ నష్టపోకుండా 92 పరుగులు చేసింది. అయితే ఫ్రేజర్ ఔటైనప్పటికీ ఢిల్లీ స్కోరు వేగం తగ్గలేదు. 10 ఓవర్లలో ఢిల్లీ 128/2తో నిలిచింది. ముంబై బౌలర్లు లైన్ అండ్ లెంగ్త్తో బౌలింగ్ చేయడంలో కాస్త తడబడ్డారు. అంతేగాక ఫీల్డర్లు చురుకుగా ఫీల్డింగ్ చేయలేదు. దీంతో బౌండరీ లైన్లో ఫీల్డింగ్ చేస్తున్న హార్దిక్ తమ ఆటగాళ్లపై కోపబడ్డాడు. ఫ్రస్టేషన్తో అరిచాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. కాగా, రెండు ఓవర్లు వేసిన హార్దిక్ 41 పరుగులు సమర్పించుకున్నాడు.