Mumbai Indians: ఐపీఎల్ 2025లో ఎట్టకేలకు ముంబయి ఇండియన్స్ మురిసింది. వాస్తవానికి ఈ సీజన్ లో మొదట ఆడిన ఐదు మ్యాచుల్లో నాలుగింటిలో ఓడిపోయి.. పాయింట్ల పట్టికలో కిందకి పడిపోయింది. అయితే ఇప్పుడు తాజాగా జరిగిన మ్యాచులో దిల్లీ క్యాపిటల్స్ పై అదృష్టం కొద్ది 12 పరుగులు తేడాతో గెలిచింది. తద్వారా ఓ అరుదైన రికార్డును అందుకుని చరిత్ర సృష్టించింది. అదేంటంటే?
ఆదివారం (ఏప్రిల్ 13) రసవత్తరంగా సాగిన మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన ముంబయి ఇండియన్స్.. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 205 పరుగులు చేసింది. తిలక్ వర్మ (33 బంతుల్లో 6×4, 3×6 సాయంతో 59 పరుగులు), నమన్ ధీర్ (17 బంతుల్లో 3×4, 2×6 సాయంతో 38 నాటౌట్) చెలరేగి ఆడారు. రికిల్టన్ (25 బంతుల్లో 5×4, 2×6 సాయంతో 41 పరుగులు), సూర్యకుమార్ (28 బంతుల్లో 5×4, 2×6 సాయంతో 40 పరుగులు) చేశారు.

అనంతరం లక్ష్య ఛేదనలో కరుణ్ నాయర్ (40 బంతుల్లో 12×4, 5×6 సాయంతో 89 పరుగులు) చెలరేగి ఆడినా.. ఫలితం దక్కలేదు. గెలుపు ముంగిట రనౌట్లు.. దిల్లీ క్యాపిటల్స్ కొంప ముంచాయి. విజయానికి చివరి 9 బంతుల్లో 15 పరుగులు అవసరమైన సమయంలో.. ఒత్తిడి కారణంగా వరుసగా మూడు బంతుల్లో ముగ్గురు బ్యాటర్లు రనౌట్ అయ్యారు. దీంతో దిల్లీ.. 19 ఓవర్లలో 193 పరుగులు చేసి ఆలౌటైంది. ఫలితంగా అనూహ్య ఓటమిని అందుకుంది. ఇంపాక్ట్ ప్లేయర్ కర్ణ్ శర్మ (3/36) అద్భుతంగా బౌలింగ్ చేసి మ్యాచ్ను ముంబయి వైపునకు మలుపు తిప్పాడు.
తొలి జట్టుగా చరిత్ర..
అయితే ఈ విజయంతో ముంబయి ఇండియన్స్ ఓ అరుదైన రికార్డు సాధించింది. ఫస్ట్ ఇన్నింగ్స్ లో 200+ స్కోర్ చేసినప్పుడల్లా గెలిచిన తొలి జట్టుగా నిలిచింది ముంబయి. ఇప్పటి వరకు వరుసగా 15 మ్యాచుల్లో ఇలానే గెలిచింది. దిల్లీ క్యాపిటల్స్ కూడా వరుసగా 13 సార్లు ఇలానే విజయం సాధించింది. కానీ సీఎస్కే మాత్రం.. 200+ స్కోర్ ను 21 సార్లు డిఫెండ్ చేసుకోగా... ఐదుసార్లు ఓడింది. ఆ తర్వాత ఆర్సీబీ(19 విజయాలు, 5 ఓటములు), సన్ రైజర్స్ (15 విజయాలు, 2 ఓటములు) ఉన్నాయి.