ఐపీఎల్-2024 సీజన్లో పరుగుల వరద కొనసాగుతోంది. అరుణ్జైట్లీ స్టేడియంలో 504 పరుగులు నమోదైన మ్యాచ్లో ముంబై ఇండియన్స్పై ఢిల్లీ క్యాపిటల్స్ 10 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లకు 257 పరుగులు చేసింది. ఐపీఎల్ చరిత్రలో ఢిల్లీకి ఇదే అత్యధిక స్కోరు.
ఓపెనర్ జేక్ ఫ్రేజర్ మెక్గుర్క్ (84; 27 బంతుల్లో, 11x4, 6x6) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. 15 బంతుల్లో అర్ధశతకం సాధించాడు. ట్రిస్టన్ స్టబ్స్ (48*; 25 బంతుల్లో, 6x4, 2x6), షై హోప్ (41; 17 బంతుల్లో, 5x6) సత్తాచాటారు. ముంబై బౌలర్లలో బుమ్రా (1/35) మినహా మిగిలినందరూ ధారాళంగా పరుగులు ఇచ్చారు.

అనంతరం ముంబై ఇండియన్స్ 20 ఓవర్లకు తొమ్మిది వికెట్లు కోల్పోయి 247 పరుగులు చేసింది. ఐపీఎల్ చరిత్రలో ముంబైకి ఇదే అత్యధిక స్కోరు కావడం విశేషం. తెలుగు కుర్రాడు తిలక్ వర్మ (63; 32 బంతుల్లో, 4x4, 4x,6) అద్భుతంగా పోరాడాడు. హార్దిక్ పాండ్య (46; 24 బంతుల్లో, 4x4, 3x6), టిమ్ డేవిడ్ (37; 17 బంతుల్లో, 2x4, 3x6) మెరిశారు.
కాగా, మ్యాచ్ అనంతరం ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్య మాట్లాడాడు. ఓటమికి గల కారణాలు వివరించాడు. జేక్ ఫ్రేజర్ అద్భుతంగా ఆడాడని, యువత దేనికి భయపడదని అతను నిరూపించాడని హార్దిక్ అన్నాడు. ఛేదనలో మిడిల్ ఓవర్లలో కాస్త మెరుగ్గా ఆడాల్సిందని అభిప్రాయపడ్డాడు. పేలవమైన వ్యూహాలు పరాజయానికి కారణమని తెలిపాడు. అక్షర్ పటేల్ ఓవర్లు ముగిసిన తర్వాత లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాటర్లు వెళ్లాల్సి ఉందని హార్దిక్ పేర్కొన్నాడు.
''విజయానికి చాలా దగ్గరగా వచ్చాం. ఒకప్పుడు ఓటమి అంతరం కొన్ని ఓవర్లుగా ఉండేది. ఇప్పుడు కొన్ని బంతులుగా మారింది. ఇలాంటి మ్యాచ్ల్లో బౌలర్లపై ఒత్తిడి ఉంటుందని తెలుసు. కాబట్టి మాపై నమ్మకం ఉంచుకొని పోరాడాలనుకున్నాం. మిడిల్ ఓవర్లలో కాస్త మెరుగ్గా ఆడాల్సింది. అంతేగాక అక్షర్ పటేల్ ఓవర్ల తర్వాత ఎడమచేతి వాటం బ్యాటర్లు రావాల్సింది''
''మ్యాచ్లో ఈ విషయాలపై ఫోకస్ మిస్ అయ్యాం. ఇక జేక్ ఫ్రేజర్ అద్భుతంగా ఆడాడు. కాలిక్యులేటెడ్ రిస్క్ షాట్స్ ఆడాడు. అతడు మైదానంలో గొప్ప ప్రదర్శన చేశాడు. యువత దేనికి భయపడదని నిరూపించాడు. టాస్ గెలిచిన అనంతరం బౌలింగ్ ఎంచుకోవడం ఓటమికి కారణం కాదని అభిప్రాయపడుతున్నాను'' అని హార్దిక్ తెలిపాడు.