ఢిల్లీ క్యాపిటల్స్ కుర్రాడు జేక్ ఫ్రేజర్ మెక్గుర్క్ సూపర్ ఫామ్ కొనసాగిస్తున్నాడు. సొంతమైదానంలో ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. 27 బంతుల్లో 87 పరుగులు సాధించాడు. 11 బౌండరీలు, ఆరు సిక్సర్లు బాదాడు. అతడికి తోడుగా ట్రిస్టన్ స్టబ్స్ (48*; 25 బంతుల్లో, 6x4, 2x6), షై హోప్ (41; 17 బంతుల్లో, 5x6) సత్తాచాటడంతో ఢిల్లీ నాలుగు వికెట్లకు 257 పరుగులు చేసింది.
ఐపీఎల్ చరిత్రలో ఢిల్లీ క్యాపిటల్స్కు ఇదే అత్యధిక స్కోరు. అంతకుముందు 2011లో పంజాబ్పై చేసిన 231/4 స్కోరే అత్యధికంగా ఉండేది. అయితే ముంబై బౌలర్లపై ఊచకోతకు దిగిన జేక్ ఫ్రేజర్ అరుదైన రికార్డులు సాధించాడు. ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఫాస్టెస్ హాఫ్ సెంచరీ సాధించిన ఆటగాడిగా రెండో సారి చరిత్రకెక్కాడు.

22 ఏళ్ల ఫ్రేజర్ 15 బంతుల్లో అర్ధశతకం బాదాడు. ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్పై కూడా అతను 15 బంతుల్లో 50 రన్స్ మార్క్ను అందుకున్నాడు. మరోసారి తన రికార్డును తిరగరాశాడు. అయితే ముంబై ఇండియన్స్పై 300కు పైగా స్ట్రైక్రేట్తో ఇన్నింగ్స్ ఆడిన ఫ్రేజర్ అరుదైన ఘనత సాధించాడు.
ఐపీఎల్ చరిత్రలో ఓ ఇన్నింగ్స్లో కనీసం 20 బంతులు ఎదుర్కొని 300కు పైగా స్ట్రైక్రేటు సాధించిన మూడో ఆటగాడిగా జేక్ ఫ్రేజర్ చరిత్ర సృష్టించాడు. 2014 సీజన్లో సురేశ్ రైనా, యూసఫ్ పఠాన్ ఈ ఘనత సాధించాడు. పదేళ్ల తర్వాత ఫ్రేజర్ ఈ ఘనత అందుకున్నాడు. పంజాబ్పై రైనా 348 స్ట్రైక్రేటుతో బ్యాటింగ్ చేశాడు. 25 బంతుల్లో 87 పరుగులు బాదాడు. యూసఫ్ సన్రైజర్స్ హైదరాబాద్పై 327 స్ట్రైక్రేటుతో 22 బంతుల్లో 72 రన్స్ చేశాడు. మూడో స్థానంలో ఉన్న ఫ్రేజర్ 311 స్ట్రైక్రేటుతో స్కోరు చేశాడు.
ఫ్రేజర్ సాధించిన స్కోరులో 95% పరుగులు బౌండరీల ద్వారానే వచ్చాయి. 50+ స్కోరు సాధించిన ఆటగాళ్లలో అత్యధికంగా బౌండరీల ద్వారా పరుగులు రాబట్టుకున్న ప్లేయర్ల జాబితాలో సురేశ్ రైనా (96.55%), కైల్ మేయర్స్ (96.30%), ఆండ్రి రసెల్ (95.38%), ఫ్రేజర్ (95.38%) ఉన్నారు.