ఢిల్లీ క్యాపిటల్స్ అదరగొట్టింది. ఈ సీజన్ తొలి అర్ధభాగంలో నిరాశపరిచిన ఢిల్లీ సెకండ్ హాఫ్లో చెలరేగుతోంది. సొంతమైదానంలో శనివారం ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో 10 పరుగుల తేడాతో గెలిచింది. పరుగుల వరద పారిన ఈ మ్యాచ్ ఆఖరి వరకు ఉత్కంఠగా సాగింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లకు 257 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఐపీఎల్ చరిత్రలో ఢిల్లీకి ఇదే అత్యధిక స్కోరు.
జేక్ ఫ్రేజర్ మెక్గుర్క్ (84; 27 బంతుల్లో, 11x4, 6x6) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ట్రిస్టన్ స్టబ్స్ (48*; 25 బంతుల్లో, 6x4, 2x6), షై హోప్ (41; 17 బంతుల్లో, 5x6) సత్తాచాటారు. ముంబై బౌలర్లలో బుమ్రా (1/35) మినహా మిగిలినందరూ ధారాళంగా పరుగులు ఇచ్చారు. అనంతరం ముంబై ఇండియన్స్ 20 ఓవర్లకు తొమ్మిది వికెట్లు కోల్పోయి 247 పరుగులు చేసింది. తెలుగు కుర్రాడు తిలక్ వర్మ (63; 32 బంతుల్లో, 4x4, 4x,6) అద్భుతంగా పోరాడాడు. హార్దిక్ పాండ్య (46; 24 బంతుల్లో, 4x4, 3x6), టిమ్ డేవిడ్ (37; 17 బంతుల్లో, 2x4, 3x6) మెరిశారు.

భారీ ఛేదనకు దిగిన ముంబైకు శుభారంభం లభించలేదు. రోహిత్ శర్మ (8; 8 బంతుల్లో, 1x4)ను ఖలీల్ అహ్మద్ ఔట్ చేశాడు. మరో ఓపెనర్ ఇషాన్ కిషన్ (20; 14 బంతుల్లో; 4x4) కూడా ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయాడు.
వన్డౌన్లో వచ్చిన సూర్యకుమార్ యాదవ్ ఆది నుంచే టాప్ గేర్లో ఆడాడు. మూడు బౌండరీలు, రెండు సిక్సర్లతో 13 బంతుల్లో 26 పరుగులు చేశాడు. కానీ ఖలీల్ ట్రాప్లో సూర్య చిక్కుకున్నాడు.
దీంతో ముంబై పవర్ప్లేలో 65 పరుగులకు మూడు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో బ్యాటింగ్కు వచ్చిన హార్దిక్ పాండ్య తిలక్తో కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. స్పిన్నర్లను లక్ష్యంగా చేసుకుని హార్దిక్ భారీ షాట్లు ఆడాడు. అయితే అర్ధశతకం దిశగా సాగుతున్న హార్దిక్ను రసిక్ ఔట్ చేశాడు. మరోవైపు తిలక్ తన పోరాటం కొనసాగించాడు. ఈ క్రమంలో 25 బంతుల్లో అర్ధశతకం సాధించాడు. టిమ్ డేవిడ్తో కలిసి లక్ష్యాన్ని క్రమంగా కరిగించాడు.
ముంబై విజయానికి 18 బంతుల్లో 64 పరుగులు అవసరమవ్వగా.. ముకేశ్ బౌలింగ్లో డేవిడ్ వరుసగా 6, 4, 6 బాదాడు. కానీ నాలుగో బంతికే డేవిడ్ ఔటయ్యాడు. ఆఖరి బంతిని తిలక్ సిక్సర్గా మలచడంతో ఈ ఓవర్లో 23 పరుగులు వచ్చాయి. అనంతరం 19వ ఓవర్లో నబీ (7; 4 బంతుల్లో, 1x6) ఔటైనప్పటికీ ముంబై 16 పరుగులు సాధించింది. ఢిల్లీ బౌలర్లలో రసిక్ (3/34), ముకేశ్ (3/59) చెరో మూడు వికెట్లు, ఖలీల్ (2/45) రెండు వికెట్లు తీశారు.
దీంతో ముంబై విజయ సమీకరణం చివరి ఓవర్లో 25 పరుగులుగా మారింది. తిలక్ స్ట్రైకింగ్లో ఉండటంతో ముంబై ధీమాగా, ఢిల్లీ ఒత్తిడిలో ఉంది. కానీ ఆఖరి ఓవర్ తొలి బంతికి తిలక్ రెండో పరుగుకు ప్రయత్నిస్తూ రనౌట్వడంతో ఢిల్లీ ఊపిరిపీల్చుకుంది. అయితే ఆ తర్వాత వుడ్ సిక్సర్, చావ్లా ఫోర్ బాది ఓటమి అంతరాన్ని తగ్గించారు.
ఫ్రేజర్ విధ్వంసం
అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్కు అదిరే ఆరంభం దక్కింది. జేక్ ఫ్రేజర్ మెక్గుర్క్ ధాటికి స్కోరుబోర్డు పరుగులు పెట్టింది. తొలి ఓవర్ నుంచే ఫ్రేజర్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ పవర్ప్లేలో వికెట్ నష్టపోకుండా 92 పరుగులు చేసింది. ఈ క్రమంలో ఫ్రేజర్ 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించాడు. ఢిల్లీ తరఫున ఫాస్టెస్ హాఫ్ సెంచరీ రికార్డును రెండో సారి సాధించాడు.
ఆ తర్వాత ఫ్రేజర్, మరో ఓపెనర్ అభిషేక్ పోరల్ (36; 27 బంతుల్లో, 3x4, 1x6)ను స్వల్ప వ్యవధిలో ఔట్ చేసి ముంబై పోటీలోకి వచ్చింది. అప్పటికే ఢిల్లీ 10 ఓవర్లలో 128/2తో నిలిచింది. ఆ తర్వాత షై హోప్, ట్రిస్టన్ స్టబ్స్, రిషభ్ పంత్(29; 19 బంతుల్లో, 2x4, 2x6) చెలరేగడంతో ఢిల్లీ భారీ స్కోరు చేసింది. ముంబై బౌలర్లలో ల్యూక్, బుమ్రా, చావ్లా, నబీ తలో వికెట్ తీశారు.