
షా, వార్నర్ శుభారంభం
టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్కు ఓపెనర్లు డేవిడ్ వార్నర్, పృథ్వీ షా మంచి ఆరంభాన్ని ఇచ్చారు. వీరిద్దరు పవర్ప్లేలోనే 68 పరుగులు చేశారు. మొత్తంగా 8.4 ఓవర్లలో తొలి వికెట్కు 93 పరుగులు జోడించారు. ఈ క్రమంలో పృథ్వీ షా 27 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మొత్తంగా 29 బంతుల్లో 51 పరుగులు చేసిన పృథ్వీ షా.. వరుణ్ చక్రవర్తి బౌలింగ్లో క్లీన్బౌల్డ్ అయ్యాడు. అతని ఇన్నింగ్స్లో 6 ఫోర్లు, 2 సిక్సులు ఉన్నాయి.

వార్నర్ హాఫ్ సెంచరీ
అనంతరం డేవిడ్ వార్నర్.. కెప్టెన్ రిషబ్ పంత్తో కలిసి రెండో వికెట్కు 25 బంతుల్లోనే 55 పరుగులు జోడించాడు. ఈ క్రమంలోనే వార్నర్ ఐపీఎల్లో 51వ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే 14 బంతుల్లోనే 27 పరుగులు చేసిన రిషబ్ పంత్ జట్టు స్కోర్ 148 పరుగుల వద్ద ఉండగా రసూల్ బౌలింగ్లో భారీ షాట్కు ప్రయత్నించి ఉమేష్ యాదవ్కు చిక్కాడు. పంత్ ఇన్నింగ్స్లో 2 ఫోర్లు, 2 సిక్సులు ఉన్నాయి. అప్పటికి 13 ఓవర్లు అయ్యాయి.

తిప్పేసిన నరైన్
ఈ క్రమంలో కోల్కతా స్పిన్నర్ సునీల్ నరైన్ ఢిల్లీని దెబ్బకొట్టాడు. లలిత్ యాదవ్ (1), రొవమాన్ పావెల్ (8)ను వెంట వెంటనే ఫెమిలియన్ చేర్చాడు. ఆ వెంటనే డేవిడ్ వార్నర్ (61 రన్స్..6 ఫోర్లు, 2 సిక్సులు) కూడా ఉమేష్ యాదవ్ బౌలింగ్లో భారీ షాట్కు ప్రయత్నించి ఔటవడంతో 16.4 ఓవర్లలో 166 పరుగులకు ఢిల్లీ 5 వికెట్లు కోల్పోయింది.

చివర్లో చెలరేగిన అక్షర్, శార్దూల్
చివరి 20 బంతుల్లో ఆల్రౌండర్లు అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్ చెలరేగారు. ఫోర్లు, సిక్సులతో విరుచుపడ్డారు. ఈ క్రమంలో 20 బంతుల్లోనే అజేయంగా 49 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. చివరి 2 ఓవర్లలోనే 39 పరుగులు బాదేశారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లు ముగిసే సమయానికి ఢిల్లీ క్యాపిటల్స్ 5 వికెట్ల నష్టానికి 215 పరుగుల భారీ స్కోర్ సాధించింది. అక్షర్ పటేల్ (14 బంతుల్లో 22 రన్స్, 2 ఫోర్లు, ఒక సిక్సు), శార్దూల్ ఠాకూర్ (11 బంతుల్లో 29 రన్స్, ఒక పోర్, 3 సిక్సులు) అజేయంగా నిలిచారు. కోల్కతా బౌలర్లలో సునీల్ నరైన్ 2, వరుణ్ చక్రవర్తి, ఉమేష్ యాదవ్, ఆండ్రూ రసెల్ తలో వికెట్ తీశారు.


Click it and Unblock the Notifications












