పరుగుల వరద పారిన మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్పై ఢిల్లీ క్యాపిటల్స్ నాలుగు పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన డీసీ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లకు 224 పరుగులు చేసింది. ఓ దశలో 44 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో నిలిచిన ఢిల్లీని అక్షర్ పటేల్తో కలిసి (66; 43 బంతుల్లో, 5x4, 4x6)తో కలిసి రిషభ్ పంత్ (88*; 43 బంతుల్లో, 5x4, 8x6) గొప్పగా ఆదుకున్నాడు. ఆఖర్లో ట్రిస్టన్ స్టబ్స్ (26*; 7 బంతుల్లో, 3x4, 2x6) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు.
అనంతరం ఆఖరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన ఛేదనలో గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లకు ఎనిమిది వికెట్లు కోల్పోయి 220 పరుగులు చేసింది. సాయి సుదర్శన్ (65; 39 బంతుల్లో, 7x4, 2x6), డేవిడ్ మిల్లర్ (55; 23 బంతుల్లో, 6x4, 3x6) పోరాడారు. రషీద్ ఖాన్ (21*; 11 బంతుల్లో, 3x4, 1x6) మ్యాచ్ను దాదాపు గెలిపించేంత పనిచేశాడు. కానీ ఢిల్లీ బౌలర్లు రషీద్ను కట్టడిచేశారు. కుల్దీప్ యాదవ్ (2/29) పొదుపుగా బౌలింగ్ వేశాడు.

బ్యాటింగ్లో సత్తాచాటిన ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషభ్ పంత్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ లభించింది. ఈ సీజన్లో పంత్కు ఇది రెండో అవార్డు. కాగా, అనంతరం పంత్ తమ జట్టు ప్రదర్శన గురించి మాట్లాడాడు. ఆఖర్లో నోకియా బౌలింగ్ ఇవ్వకుండా రసిక్తో బౌలింగ్ వేయించాలని మ్యాచ్ మధ్యలోనే నిర్ణయించుకున్నట్లు పంత్ తెలిపాడు. ఈ నిర్ణయం సత్ఫలితాన్ని ఇచ్చిందని పేర్కొన్నాడు. తన బ్యాటింగ్ పట్ల సంతోషంగా ఉన్నానని, మ్యాచ్లో తాను సాధించే తొలి సిక్సర్ తనపై తనకు మరింత విశ్వాసాన్ని కలగజేస్తుందని పంత్ అన్నాడు.
''నోకియా కఠిన సమయాన్ని ఎదుర్కొంటున్నాడు. అంతేగాక టీ20 అనేది ఫన్నీ గేమ్. ఛేజింగ్లో 14-15 ఓవర్ల నుంచి బంతి చాలా సులభంగా వస్తుంది. కాబట్టి రసిక్దర్ సలామ్ను నమ్మాలనుకున్నాం. సాధారణంగా మ్యాచ్లో ఎవరూ బాగా బౌలింగ్ చేస్తారో వాళ్లతోనే కొనసాగించాలనుకుంటాం. ఇవి కెప్టెన్గా తీసుకునే నిర్ణయాలు. అది ఈ రోజు సత్ఫలితాన్ని ఇచ్చినందకు సంతోషంగా ఉంది. మేం 44/3 స్కోరుతో ఉన్నప్పుడు పోరాడాలని, ప్రధాన స్పిన్నర్లపై దాడికి దిగాలని నిర్ణయించుకున్నాం''
''మైదానంలో బరిలోకి దిగిన ప్రతిసారి మంచి అనుభూతి పొందుతున్నాను. ప్రతి గంట చాలా కీలకం, మైదానంలో ఉండటాన్ని ఎంతో ఇష్టపడుతున్నాను. నేను 100 శాతం గొప్ప ప్రదర్శన చేయడానికి ప్రయత్నిస్తుంటా. కానీ, కొన్నిసార్లు దానికి సమయం పడుతుంది. మ్యాచ్లో సాధించే తొలి సిక్సర్తో కాన్ఫిండెంట్ పెరుగుతుంది'' అని పంత్ తెలిపాడు. నోకియా మూడు ఓవర్లలో 48 పరుగులిచ్చి ఒక్క వికెట్ తీయగా, రసిక్ నాలుగు ఓవర్లలో 41 పరుగులిచ్చి ఒక్క వికెట్ సాధించాడు.