ఢిల్లీ క్యాపిటల్స్ అదరగొడుతోంది. తొలి అయిదు మ్యాచ్ల్లో ఒకే విజయంతో నిరాశపరిచిన ఢిల్లీ తర్వాత దూకుడు పెంచింది. అనంతరం నాలుగు మ్యాచ్ల్లో మూడింట్లో గెలిచి పాయింట్ల పట్టికలో ఆరో స్థానానికి ఎగబాకింది. సొంతమైదానంలో బుధవారం జరిగిన ఉత్కంఠ పోరులో గుజరాత్ టైటాన్స్పై నాలుగు పరుగుల తేడాతో నెగ్గి ఫ్లే ఆఫ్స్ అవకాశాలు మెరుగుపర్చుకుంది.
పరుగుల వరద పారిన ఈ మ్యాచ్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. తొలుత బ్యాటింగ్ చేసిన డీసీ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లకు 224 పరుగులు చేసింది. ఓ దశలో 44 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి ఢిల్లీ కష్టాల్లో పడింది. కానీ అక్షర్ పటేల్తో కలిసి (66; 43 బంతుల్లో, 5x4, 4x6)తో కలిసి రిషభ్ పంత్ (88*; 43 బంతుల్లో, 5x4, 8x6) గొప్పగా ఆదుకున్నాడు.

అక్షర్, పంత్ చెలరేగడంతో స్కోరుబోర్డు పరుగులు పెట్టింది. వీరిద్దరు నాలుగో వికెట్కు 113 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఆఖర్లో ట్రిస్టన్ స్టబ్స్ (26*; 7 బంతుల్లో, 3x4, 2x6) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు.సందీప్ వారియర్ మూడు (3/15) వికెట్లతో ఆకట్టుకున్నాడు. అనంతరం ఆఖరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన ఛేదనలో గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లకు ఎనిమిది వికెట్లు కోల్పోయి 220 పరుగులు చేసింది. సాయి సుదర్శన్ (65; 39 బంతుల్లో, 7x4, 2x6), డేవిడ్ మిల్లర్ (55; 23 బంతుల్లో, 6x4, 3x6) పోరాడారు.
రషీద్ ఖాన్ (21*; 11 బంతుల్లో, 3x4, 1x6) మ్యాచ్ను దాదాపు గెలిపించేంత పనిచేశాడు. కానీ ఢిల్లీ బౌలర్లు, ఫీల్డర్లు రషీద్ను సమష్టిగా కట్టడిచేశారు. ఓ దశలో గుజరాత్ ఓటమి ఖరారనుకున్నారంతా. కానీ మిల్లర్ విధ్వంసంతో జీటీ విజయంపై ఆశలు పెరిగాయి. మిల్లర్ ఔటైనప్పటికీ రషీద్ ఖాన్ క్రీజులో ఉండటంతో గుజరాత్ గెలుపుపై ధీమాగానే ఉంది.
గుజరాత్ విజయానికి 12 బంతుల్లో 37 పరుగులు అవసరమవ్వగా, రసిక్ బంతిని అందుకున్నాడు. తొలి బంతికి రషీద్ బౌండరీ బాదాడు. రెండో బంతిని లాంగాఫ్ మీదుగా భారీషాట్ ఆడాడు. అయితే సిక్సర్గా వెళ్తున్న ఆ బంతిని స్టబ్స్ అద్భుత ఫీల్డింగ్తో అందుకున్నాడు. కానీ బౌండరీలైన్లో బ్యాలెన్స్ తప్పాడు. అయినప్పటికీ స్టబ్స్ రోప్ను దాటకముందే బంతిని మైదానంలో విసిరి అయిదు పరుగులు సేవ్ చేశాడు. అక్కడ గుజరాత్కు ఒక్క పరుగే దక్కింది. అంతిమంగా గుజరాత్ నాలుగు పరుగుల తేడాతో ఓటమిపాలవ్వడంతో స్టబ్స్ సూపర్ మ్యాన్ ఫీల్డింగే ఢిల్లీని గెలిపించిందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.