ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) ఆదరణ ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్నా, వివాదాలూ అదే స్థాయిలో వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా, గెలవాల్సిన మ్యాచ్లలో జట్ల ఓటమి, ఆటగాళ్ల ప్రదర్శనపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా 2026 ఐపీఎల్ సీజన్లో గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్లోని పరిణామాలు ఈ అనుమానాలకు తావిచ్చాయి. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ జట్టు శుభ్మన్ గిల్ 70, జోస్ బట్లర్ 52, వాషింగ్టన్ సుందర్ 55 పరుగులతో రాణించారు. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 210 పరుగులు చేసి, ఢిల్లీ క్యాపిటల్స్ ముందు 211 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.
లక్ష్య ఛేదనకు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్, కేఎల్ రాహుల్ 92 పరుగుల ఇన్నింగ్స్తో లక్ష్యం వైపు దూసుకుపోయింది. అయితే 134/4 స్థితిలో తీవ్ర కష్టాల్లో ఉన్న జట్టుకు డేవిడ్ మిల్లర్ గాయంతో రిటైర్డ్ హర్ట్ అయ్యాడు. చివర్లో బరిలోకి తిరిగి వచ్చి గెలిపించే ప్రయత్నం ఆకట్టుకుంది. చివరి ఓవర్లో జరిగిన పరిణామాలు తీవ్ర అనుమానాలకు దారితీశాయి. మిల్లర్ లాంగ్-ఆఫ్ వైపు కొట్టిన షాట్ సరిగ్గా బౌండరీపై పడింది. ఫోరా, సిక్సా అని స్పష్టత లేకుండానే, రీప్లే చూపించకుండా అంపైర్ హడావిడిగా దానిని ఫోర్గా ప్రకటించడం వివాదం రేపింది.

రెండు బంతుల్లో 2 పరుగులు కావాల్సి ఉండగా, సులభమైన సింగిల్ తీసే అవకాశం ఉన్నా మిల్లర్ పరుగెత్తలేదు. మ్యాచ్ టై అయ్యే అవకాశం ఉన్నా, పరుగు తీసేందుకు నిరాకరించాడు. చివరి బంతికి పరుగులు రావని తెలిసీ పరుగెత్తి కుల్దీప్ యాదవ్ రనౌట్కు కారణం కావడం వంటి పరిణామాలు ఫిక్సింగ్ అనుమానాలను బలపరుస్తున్నాయి. ఈ ఓటమికి బ్యాటర్ మిల్లరే కారణమని అభిమానులు భావిస్తున్నారు. కుల్దీప్ రనౌట్ను ఎందుకు రిప్లైలో చూపించలేదని ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలో మ్యాచ్ ఫిక్స్ అయిందని పలువురు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.