
దుబాయ్: యూఏఈలో కొనసాగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 చివరి అంకానికి చేరుకుంది. శుక్రవారంతో లీగ్ మ్యాచ్లు ముగియగా.. ఈరోజు (సెప్టెంబర్ 10)ప్లే ఆఫ్స్ ప్రారంభం కానున్నాయి. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్ (డీసీ), చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) తొలి క్వాలిఫయర్లో మరికొద్ది సేపట్లో తలపడనున్నాయి. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచులో టాస్ గెలిచిన చెన్నై కెప్టెన్ ఎంఎస్ ధోనీ బౌలింగ్ ఎంచుకున్నాడు. ధోనీ తుది జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదు. దాంతో మిస్టర్ ఐపీఎల్ సురేష్ రైనా లేకుండానే చెన్నై బరిలోకి దిగుతోంది. మరోవైపు ఢిల్లీ కెప్టెన్ రిషబ్ పంత్ తుది జట్టులో ఒక మార్పు చేశాడు. రిపాల్ పటేల్ బదులుగా టామ్ కరన్ జట్టులోకి వచ్చాడు.
లీగ్ రౌండ్లో 14 మ్యాచ్ల్లో 10 విజయాలతో ఢిల్లీ కాపిటల్స్ 20 పాయింట్లు సాధించి పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. మరోవైపు చెన్నై సూపర్ కింగ్స్ 14 మ్యాచ్లలో తొమ్మిది విజయాలతో రెండవ స్థానంలో ఉంది. మొదటి క్వాలిఫయర్లో ఏ జట్టు గెలిచినా.. నేరుగా ఫైనల్కు వెళ్తుంది. ఓడిపోయిన జట్టు ఫైనల్ బెర్త్ కోసం బుధవారం జరిగే క్వాలిఫయర్-2లో గెలిచిన జట్టుతో మరో మ్యాచ్ ఆడనుంది. చెన్నై, ఢిల్లీ జట్ల మధ్య మ్యాచ్ రాత్రి 7.30 గంటలకు ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్లో ప్రత్యక్ష ప్రసారం కానుంది. అలాగే డిస్నీ+హాట్స్టార్ యాప్లోనూ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం కానుంది.
ఐపీఎల్ టోర్నీలో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు 25 సార్లు తలపడ్డాయి. ఇందులో చెన్నై 15 సార్లు గెలుపొందగా.. ఢిల్లీ 10 విజయాలు అందుకుంది. ఐపీఎల్ 2021లో ఢిల్లీ, చెన్నై తలపడిన రెండు మ్యాచులో పంత్ సేన విజయం సాదించింది. ఇరు జట్ల మధ్య చివరి ఐదు మ్యాచుల్లో ఒకటి చెన్నై, నాలుగు ఢిల్లీ గెలిచింది. ఇప్పుడు ఈ సీజన్లో మూడోసారి ఇరు జట్లు తలపడబోతున్నాయి. దుబాయ్ పిచ్ బ్యాటింగ్కు కాస్త కష్టంగానే ఉంటుంది. ఈ మైదానంలో జరిగిన గత ఏడు మ్యాచ్ల్లో ఒక్క ఇన్నింగ్స్లోనూ స్కోరు 170 దాటలేదు. బౌలర్లకు ఎక్కువగా సహకరించే ఆస్కారముంది. మొదటలో పేసర్లకు, ఆపై స్పిన్నర్లకు అనుకూలంగా ఉండనుంది. ఈ సీజన్లో ఇక్కడ జరిగిన 11 మ్యాచ్ల్లో ఎనిమిది సార్లు రెండో సారి బ్యాటింగ్ చేసిన జట్టే గెలిచింది. రెండో ఇన్నింగ్స్లో మంచు ప్రభావం ఉండడమే అందుకు కారణం.
తుది జట్లు:
ఢిల్లీ క్యాపిటల్స్: పృథ్వీ షా, శిఖర్ ధావన్, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్ (కెప్టెన్), శిమ్రాన్ హెట్మైర్, అక్షర్ పటేల్, ఆర్ అశ్విన్, కాగిసో రబడ, టామ్ కరన్, అన్రిచ్ నోర్జ్, అవేశ్ ఖాన్.
చెన్నై: రుతురాజ్ గైక్వాడ్, ఫాఫ్ డుప్లెసిస్, మొయిన్ అలీ, అంబటి రాయుడు, రాబిన్ ఉతప్ప, ఎంఎస్ ధోనీ (కెప్టెన్), రవీంద్ర జడేజా, డ్వేన్ బ్రావో, శార్దూల్ ఠాకూర్, దీపక్ చహర్, జోష్ హజిల్వుడ్.