
దుబాయ్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 తొలి క్వాలిఫయర్లో చెన్నై సూపర్ కింగ్స్ అద్భుత విజయం సాధించింది. దుబాయ్ వేదికగా జరిగిన మ్యాచులో ఢిల్లీ క్యాపిటల్స్పై నాలుగు వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుని ఫైనల్లో అడుగుపెట్టింది. రుతురాజ్ గైక్వాడ్ (70; 40 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్), రాబిన్ ఊతప్ప (63; 44 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్లు) రాణించడంతో ఢిల్లీకి ఓటమి తప్పలేదు. ఢిల్లీ నిర్దేశించిన 173 పరుగుల లక్ష్యాన్ని చెన్నై 19.4 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. చెన్నై విజయానికి చివరి ఓవర్లో 13 పరుగులు అవసరం కాగా.. తొలి బంతికి మొయిన్ అలీ (16) ఔటయ్యాడు. కెప్టెన్ ఎంఎస్ ధోనీ (18; 6 బంతుల్లో 3 ఫోర్లు) వరుసగా మూడు ఫోర్లు కొట్టి చెన్నైని విజయతీరాలకు చేర్చాడు.
ఈ మ్యాచులో చెన్నై విజయానికి 12 బంతుల్లో 24 పరుగులు అవసరం అయ్యాయి. రుతురాజ్ గైక్వాడ్, మొయిన్ అలీ క్రీజులో ఉండడంతో విజయం చెన్నైదే అనుకున్నారు అందరూ. 19వ ఓవర్ మొదటి బంతికే గైక్వాడ్ను ఆవేశ్ ఖాన్ ఔట్ చేశాడు. రెండో బంతికి అలీ ఫోర్.. ఐదవ బంతికి ఎంఎస్ ధోనీ సిక్స్ బాదడంతో సమీకరణం మారిపోయింది. ఆవేశ్ 11 పరుగులు ఇవ్వడంతో చివరి ఓవర్లో చెన్నై విజయానికి 13 పరుగులు అవసరం అయ్యాయి. అప్పటికి ఢిల్లీ స్టార్ పేసర్ కాగిసో రబాడా మూడు ఓవర్లు వేసి 23 పరుగులు మాత్రమే ఇచ్చాడు. దాంతో చివరి ఓవర్ అతడే వేస్తాడని అందరూ ఊహించారు. కానీ ఢిల్లీ కెప్టెన్ రిషబ్ పంత్ అనూహ్యంగా బంతిని టామ్ కరన్ చేతికి ఇచ్చాడు.
టామ్ కరన్ మొదటి బంతికి మొయిన్ అలీని ఔట్ చేశాడు. దాంతో రిషబ్ పంత్ నిర్ణయం సరైందే అనుకున్నారు. అయితే మ్యాచ్ ఫినిషర్ ఎంఎస్ ధోనీని మాత్రం టామ్ అడ్డుకోలేకపోయాడు. టామ్ వేసిన రెండు, మూడు బంతులను మహీ ఫోర్లుగా మలిచాడు, ఒత్తిడి తట్టుకోలేని టామ్ ఆ తరువాతి బంతిని వైడ్గా వేశాడు. ఇక నాలుగో బంతికి ధోనీ ఇంకో ఫోర్ బాదడంతో చెన్నై విజయం సాధించింది. అయితే కాగిసో రబాడాకు బదులుగా టామ్కు బంతిని ఇవ్వడంపై ఫాన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. టీమిండియా మాజీ పేసర్ ఇర్ఫాన్ పఠాన్ కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. 'రబాడా చివరి ఓవర్ వేయలేదు. ఈ లాజిక్ ఏంటో నాకు ఇంకా అర్ధం కావడం లేదు' అని ట్వీట్ చేశాడు.