
దుబాయ్: ఢిల్లీ క్యాపిటల్స్ (డీసీ)తో దుబాయ్ వేదికగా జరిగిన ఐపీఎల్ 2021 క్వాలిఫయర్ 1 మ్యాచులో చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) అద్భుత విజయం సాధించింది. ఢిల్లీ నిర్ధేశించిన 173 పరుగుల లక్ష్య చేధనను మరో రెండు బంతులు ఉండగానే 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఈ విజయంతో చెన్నై ఐపీఎల్ 2021 ఫైనల్లో అడుగుపెట్టింది. రాబిన్ ఉతప్ప (63; 44 బంతుల్లో 7x4, 2x6), రుతురాజ్ గైక్వాడ్ (70; 50 బంతుల్లో 5x4, 2x6) హాఫ్ సెంచరీలు చేయగా.. కెప్టెన్ ఎంఎస్ ధోనీ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఆరు బంతుల్లో మూడు ఫోర్లు ఓ సిక్స్ సాయంతో 18 పరుగులు చేసి చెన్నైకి అద్భుత విజయాన్ని అందించాడు. ఢిల్లీ బౌలర్ టామ్ కరన్ మూడు వికెట్లు పడగొట్టాడు.
చెలరేగిన ఉతప్ప :
173 పరుగుల విజయ లక్ష్య ఛేదనలో చెన్నైకి ఆదిలోనే భారీ షాక్ తగిలింది. స్టార్ ఓపెనర్ ఫాఫ్ డుప్లెసిస్ తొలి ఓవర్లోనే ఔట్ అయ్యాడు. రెండు బంతుల్లో కేవలం ఒక్క పరుగే చేసి నోర్జ్ బౌలింగ్లో బౌల్డ్ అయ్యాడు. ఈ సమయంలో చెన్నై రుతురాజ్ గౌక్వాడ్పైన ఆశలు పెట్టుకుంది. అయితే అందరి అంచనాలను తలక్రిందులు చేస్తూ రాబిన్ ఉతప్ప చెలరేగిపోయాడు. క్రీజులోకి వచ్చిరావడంతోనే ఢిల్లీ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఎడాపెడా ఫోర్లు బాదేసి.. స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. మరో ఎండ్లో గైక్వాడ్.. ఉతప్పకు మంచి మద్దతు ఇచ్చాడు. ఇద్దరు స్కోరు బోర్డును వేగంగా ముందుకు కదిలించారు. ఈ క్రమంలోనే ఉతప్ప అర్థ శతకాన్ని అందుకున్నాడు. అదే ఊపు మీద టామ్ కరెన్ బౌలింగ్లో భారీ షార్ట్కు ప్రయత్నించి రాబిన్ ఔట్ అయ్యాడు. బౌండరీ వద్ద శ్రేయస్ అయ్యర్ అద్భుత క్యాచ్ అందుకున్నాడు.
మహీ మాయ:
రాబిన్ ఉతప్ప ఔట్ అయినా.. రుతురాజ్ గైక్వాడ్ దూకుడు కొనసాగించాడు. ఈ క్రమంలోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఉతప్ప ఔట్ అయిన తర్వాత క్రీజులోకి వచ్చిన శార్దుల్ను టామ్ కరెన్ డకౌట్ చేశాడు. తర్వాత వచ్చిన అంబటి రాయుడు (1) పెద్దగా ప్రభావం చూపించలేదు. రబాడా బౌలింగ్లో అయ్యర్.. రాయుడిని రనౌట్ చేశాడు. ఎంఎస్ ధోనీ క్రీజులోకి వచ్చేసరికి మ్యాచ్ ఉత్కంఠగా మారింది. అవేశ్ వేసిన 19 ఓవర్ చివర్లో సిక్స్ కొట్టి.. కాస్త టెన్షన్ను తగ్గించాడు. 20వ ఓవర్ తొలి బంతికే అలీని అవుట్ చేశాడు టామ్ కరన్. ఇక్కడే మహీ మాయ చేశాడు. చివరి ఓవర్లో మూడు ఫోర్లు కొట్టి.. రెండు బంతులు మిగిలి ఉండగానే జట్టుకు విజయాన్ని అందించాడు. శుక్రవారం జరిగే ఫైనల్స్లో చెన్నై ఆడనున్నది. ఢిల్లీ ఫైనల్స్కు చేరుకునేందుకు మరో అవకాశం ఉంది. సోమవారం జరిగే ఎలిమినేటర్ మ్యాచ్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, కోల్కతా నైట్ రైడర్స్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్లో గెలుపొందే జట్టుతో ఢిల్లీ రెండో క్వాలిఫయర్ మ్యాచ్ బుధవారం ఆడనుంది.
చెలరేగిన షా:
అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 172 రన్స్ చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ఢిల్లీకి మంచి ఆరంభం లభించింది. సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్ (7) నెమ్మదిగా ఆడినా.. యువ ఓపెనర్ పృథ్వీ షా (60; 34 బంతుల్లో 7x4, 3x6) బౌండరీలతో విరుచుకుపడ్డాడు. జోష్ హేజిల్వుడ్ వేసిన రెండో ఓవర్లో సిక్స్, ఫోర్ బాదిన పృథ్వీ.. దీపక్ చహర్ వేసిన తర్వాతి ఓవర్లో ఏకంగా నాలుగు ఫోర్లు కొట్టాడు. అయితే హేజిల్వుడ్ వేసిన నాలుగో ఓవర్లో ధావన్ కీపర్ ఎంఎస్ ధోనీకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. వికెట్ పడినా కూడా షా జోరు తగ్గలేదు. శార్దూల్ ఠాకూర్ వేసిన ఐదో ఓవర్లో పృథ్వీ రెండు సిక్స్లు బాదాడు. దాంతో ఢిల్లీ స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది. ఐతే అదే ఓవర్లో శ్రేయాస్ అయ్యర్ (1) అవుట్ అయ్యాడు. ఆపై అక్షర్ పటేల్ (10) షాకు కాసేపు అండగా నిలిచాడు. షా ధాటిగా ఆడడంతో ఢిల్లీ స్కోర్ వేగం పెరుగుతూ వచ్చింది.
ఆదుకున్న పంత్:
ధాటిగా ఆడిన పృథ్వీ షా హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే 10వ ఓవర్లో అక్షర్ పటేల్ను మొయిన్ అలీ ఔట్ చేశాడు. ఇక 11 ఓవర్లో షాను రవీంద్ర జడేజా పెలివియన్కి పంపించాడు. దాంతో ఢిల్లీ స్కోర్ వేగం ఒక్కసారిగా తగ్గింది. ఈ సమయంలో రిషబ్ పంత్ (51; 35 బంతుల్లో 3x4, 2x6) , శిమ్రాన్ హెట్మయర్ (37; 24 బంతుల్లో 3x4, 1x6) ఢిల్లీని ఆదుకున్నారు. వీలుచిక్కినప్పుడల్లా బౌండరీలు బాదుతూ ఇన్నింగ్స్ని ముందుకు నడిపించారు. క్రీజులో ఇద్దరు హార్డ్ హిట్టర్లు ఉన్న నేపథ్యంలో ఢిల్లీ భారీ స్కోర్ చేస్తుందని అందరూ ఊహించారు. ఐతే డ్వేన్ బ్రావో వేసిన 19 ఓవర్లో హెట్మయర్ ఔట్ అయ్యాడు. ఇక చివరి ఓవర్లో పంత్ ధాటిగా ఆడుతాడనుకున్నా.. వరుసగా మూడు బంతులకు ఒక్క పరుగులు కూడా చేయలేదు. చివరి బంతికి రెండు పరుగులు చేసిన పంత్ హాఫ్ సెంచరీ చేశాడు. చెన్నై బౌలర్లలో హేజిల్వుడ్ రెండు.. జడేజా, అలీ, బ్రావో తలో వికెట్ తీశారు.