
దుబాయ్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021లో భాగంగా దుబయ్ అంతర్జాతీయ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్ (డీసీ)తో జరుగుతున్న మ్యాచులో చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) తడబడింది. సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 136 పరుగులు చేసి.. ఢిల్లీ ముందు 137 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. తెలుగు తేజం అంబటి రాయుడు (55) అర్ధ శతకంతో రాణించాడు. ఇన్నింగ్స్ చివరి ఓవర్లలో రాయుడు వేగం పెంచడంతో ఢీల్లీ ముందు చెన్నై మోస్తరు లక్ష్యాన్ని ఉంచగలిగింది. రాబిన్ ఉతప్ప (19) ఫర్వాలేదనిపించాడు. అయితే కెప్టెన్ ఎంఎస్ ధోనీ 18 పరుగులు చేసినా.. అందుకు 27 బంతులు తీసుకున్నాడు. ఒక్క బౌండరీ కూడా బాధలేదు. ఢిల్లీ స్పిన్నర్ అక్షర్ పటేల్ రెండు వికెట్లు పడగొట్టాడు.
టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన చెన్నైకి ఆదిలోనే షాక్ తగిలింది. ఓపెనర్ ఫాఫ్ డుప్లెసిస్ (10) త్వరగానే ఔట్ అయ్యాడు. అక్షర్ పటేల్ వేసిన మూడో ఓవర్ నాలుగో బంతికి పెవిలియన్ చేరాడు. ఆ తరువాత కాసేపటికే మరో ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ (13) ఔట్ అయ్యాడు. దీంతో స్కోర్ వేగం పూర్తిగా తగ్గిపోయింది. మోయిన్ అలీ (5) కూడా ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయాడు. రాబిన్ ఉతప్ప 19 బంతుల్లో 19 పరుగులు చేసి.. ఔట్ అయ్యాడు. దాంతో చెన్నై 62 పరుగులకే 4 కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
ఈ సమయంలో అంబటి రాయుడు (55) జట్టును ఆదుకున్నాడు. ఢిల్లీ బౌలర్లను సమర్ధవంతంగా ఆడుతూ.. పరుగులు చేశాడు. చెత్త బంతులను మాత్రమే బౌండరీలకు పంపిస్తూ చెన్నై స్కోరును ముందుకు నడిపాడు. ఈ క్రమంలోనే రాయుడు హాఫ్ సెంచరీ చేశాడు. మరోవైపు కెప్టెన్ ఎంఎస్ ధోనీ మరి నెమ్మదిగా ఆడాడు. ఇన్నింగ్స్ చివరలో కూడా ధాటిగా ఆడలేకపోయాడు. 18 పరుగులు చేసినా.. అందుకు 27 బంతులు తీసుకున్నాడు. దాంతో మహీ మరోసారి విఫలమయ్యాడు. రవీంద్ర జడేజా 2 బంతులు మాత్రమే ఎదుర్కొన్నాడు. దాంతో చెన్నై స్వల్ప స్కోరుకే పరిమితమైంది. ఢిల్లీ బౌలర్లలో అక్షర్ పటేల్ రెండు.. రవిచంద్రన్ అశ్విన్, అన్రిచ్ నోర్జ్, అవేశ్ ఖాన్ తలో వికెట్ తీశారు.
ఐపీఎల్ 2021లో ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడడం ఇది రెండోసారి. అంతకుముందు జరిగిన పోరులో ఢిల్లీ విజయం సాధించింది. ఇక దుబయ్ పిచ్లో ఈ రెండు జట్లు తలపడటం ఇది రెండోసారి. మొదటి మ్యాచులో ఢిల్లీ విజయం సాధించింది. గత 5 మ్యాచ్లలో రిషబ్ పంత్ సేన 3-2 తేడాతో విజయం సాధించింది. ఐపీఎల్లో ఇప్పటి వరకు ఈ రెండు జట్ల మధ్య మొత్తం 24 మ్యాచులు జరిగాయి. ఇందులో చెన్నై 15 సార్లు గెలిచింది. మరోవైపు ఢిల్లీ కేవలం 9 సార్లు మాత్రమే విజయం సాధించింది.