
దుబాయ్: సన్రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్)తో దుబాయ్ వేదికగా జరిగిన మ్యాచులో ఢిల్లీ క్యాపిటల్స్ (డీసీ) ఘన విజయం అందుకుంది. 135 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలో దిగిన ఢిల్లీ.. రెండు వికెట్లను మాత్రమే కోల్పోయి 17.5 ఓవర్లలో 139 పరుగులు చేసి సునాయాస విజయాన్ని ఖాతాలో వేసుకుంది. ఓపెనర్ శిఖర్ ధావన్ (42), స్టార్ బ్యాట్స్మన్ శ్రేయస్ అయ్యర్ (41నాటౌట్), కెప్టెన్ రిషబ్ పంత్ (35 నాటౌట్) రాణించారు. ఎస్ఆర్హెచ్ బౌలర్లు ఖలీల్ అహ్మద్, రషీద్ ఖాన్ తలో వికెట్ పడగొట్టారు. ఈ విజయంతో ఢీల్లీ మళ్లీ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలోకి దూసుకెళ్లింది.
గర్జించిన గబ్బర్:
135 పరుగుల మోస్తరు ఛేదనలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు ఆదిలోనే షాక్ తగిలింది. ఖలీల్ అహ్మద్ వేసిన మూడో ఓవర్లో రెండు ఫోర్లు బాదిన ఓపెనర్ పృథ్వీ షా (11; 8 బంతుల్లో 2x4).. అదే ఊపులో మరో భారీ షాట్కు ప్రయత్నించి ఔట్ అయ్యాడు. కెప్టెన్ కేన్ విలియమ్సన్కు అతడు క్యాచ్ ఇచ్చాడు. షా ఔట్ అయినా.. మరో ఓపెనర్ శిఖర్ ధావన్ (42; 37 బంతుల్లో 6x4, 1x6) స్వేచ్ఛగా బ్యాట్ ఝళిపించేశాడు. మాజీ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ (47 నాటౌట్: 41 బంతుల్లో 2x4, 2x6)తో కలిసి ఢిల్లీ ఇన్నింగ్స్ను గాడిలో పెట్టాడు. ఆచితూచి ఆడుతూనే.. చెత్త బంతులను బౌండరీలు పంపాడు.
పంత్ కెప్టెన్ ఇన్నింగ్స్:
శిఖర్ ధావన్, శ్రేయాస్ అయ్యర్ కలిసి రెండో వికెట్కి 52 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అయితే రషీద్ ఖాన్ను ఉతికారేద్దామనుకున్న గబ్బర్ ఎత్తుగడ ఫలించలేదు. భారీ షాట్ ఆడగా బౌండరీ లైన్ వద్ద క్యాచ్ ఇచ్చి ధావన్ ఔటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన కెప్టెన్ రిషబ్ పంత్ (35 నాటౌట్; 21 బంతుల్లో 3x4, 2x6) భారీ షాట్లతో అలరించాడు. మరోవైపు అయ్యర్ కూడా జోరందుకున్నాడు. ఓ రెండు భారీ సిక్సులు బాదాడు. పంత్ అయితే సన్రైజర్స్ హైదరాబాద్ బౌలర్లకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా విరుచుకుపడ్డాడు. దాంతో 13 బంతులు మిగిలి ఉండగానే ఢిల్లీ 8 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. స్వల్ప స్కోరును కాపాడేందుకు హైదరాబాద్ బౌలర్లు కష్టపడినా ఫలితం దక్కలేదు. ఖలీల్ అహ్మద్, రషీద్ ఖాన్ చెరో వికెట్ పడగొట్టారు. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో ఢిల్లీ క్యాపిటల్స్ (14) అగ్రస్థానానికి చేరుకుంది. 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డు ఆన్రిచ్ నోర్జే (2/12)కు దక్కింది.
టాప్ ఆర్డర్ విఫలం:
టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలలో 9 వికెట్ల నష్టానికి 134 పరుగులు చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్రైజర్స్కు శుభారంభం దక్కలేదు. తొలి ఓవర్లోనే డేవిడ్ వార్నర్ (0) అన్రిచ్ నోర్జే బౌలింగ్లో అక్షర్ పటేల్ చేతికి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. కాగిసో రబాడ వేసిన ఐదో ఓవర్ మొదటి బంతిని సిక్స్గా మలిచిన మరో ఓపెనర్ వృద్ధిమాన్ సాహా (18).. అదే ఓవర్లో చివరి బంతికి శిఖర్ ధావన్ చేతికి చిక్కి పెవిలియన్ చేరాడు.పవర్ ప్లే ముగిసే సరికి ఆరెంజ్ ఆర్మీ 32/2 స్కోరుతో నిలిచింది. కెప్టెన్ కేన్ విలియమ్సన్ (18) కూడా ఆకట్టుకోలేకపోయాడు. స్వల్ప వ్యవధిలో రెండు జీవనాధారాలు లభించినా.. భారీ ఇన్నింగ్స్ ఆడటంలో విఫలమయ్యాడు. అక్షర్ పటేల్ వేసిన 10వ ఓవర్ ఇదో బంతికి ఔట్ అయ్యాడు.
ఆదుకున్న సమద్, రషీద్:
ఆదు కుంటారనుకున్న మనీశ్ పాండే (17), కేదార్ జాదవ్ (3), జాసన్ హోల్డర్ (10) స్వల్ప స్కోరుకే వెనుదిరిగారు. ముఖ్యంగా పాండే, జాదవ్ మొదటి ఎడిషన్లోని పేలవ ప్రదర్శనను కొనసాగించారు. ఇన్నింగ్స్ చివరలో అబ్దుల్ సమద్ (28; 21 బంతుల్లో 2x4, 1x6), రషీద్ ఖాన్ (22; 19 బంతుల్లో 2x4, 1x6) రాణించడంతో హైదరాబాద్ ఈ మాత్రం స్కోరునైనా చేయగలిగింది. సందీప్ శర్మ (0), భువనేశ్వర్ కుమార్ (5 నాటౌట్) పరుగులు చేశారు. ఢిల్లీ బౌలర్ కాగిసో రబాడ 3 వికెట్లు పడగొట్టాడు. యూఏఈ మైదానాలు సన్రైజర్స్ హైదరాబాద్కు ఏ మాత్రం కలిసి రావడం లేదు. గత సీజన్లోని పరాజయాల పరంపర ఇప్పుడు కూడా కొనసాగిస్తోంది. ఇక ఐపీఎల్ 14వ సీజన్ మొదటి ఎడిషన్లో విఫలమైన సన్రైజర్స్.. అదే ఆటతీరును రెండో హాఫ్లోనూ కొనసాగించింది.
ప్లేఆఫ్ ఆశలు గల్లంతే:
సన్రైజర్స్ హైదరాబాద్ అంటేనే డేవిడ్ వార్నర్, కేన్ విలియమ్సన్, జానీ బెయిరిస్టో. ఈ ముగ్గురిలో ఒక్కరు నిలదొక్కుకున్నా మిగతా బ్యాటర్లు ఆత్మవిశ్వాసంతో ఆడతారు. బెయిరిస్టో లీగ్ నుంచి తప్పుకోగా.. వార్నర్, కేన్ విఫలం కావడంతో హైదరాబాద్ తక్కువ స్కోరుకే పరిమితం కావాల్సి వచ్చింది. ఇక కరోనా వైరస్ సోకడంతో ఫాస్ట్ బౌలర్ టీ నటరాజన్, ఐసొలేషన్లో ఉన్న ఆల్రౌండర్ విజయ్ శంకర్ ఈ మ్యాచుకు దూరమయ్యారు. అది కూడా జట్టుపై తీవ్ర ప్రభావం చూపింది. ఎనిమిదో మ్యాచ్ ఆడి ఏడో పరాజయాన్ని చవిచూసిన హైదరాబాద్.. పాయింట్ల పట్టికలో చిట్టచివరి స్థానంలో ఉంది. చివరిగా ఆడిన నాలుగు మ్యాచ్ల్లోనూ సన్రైజర్స్ ఓడిపోవడం గమనార్హం. ఇక హైదరాబాద్ జట్టు ప్లేఆఫ్ ఆశలు దాదాపు ముగిసినట్టే.