
దుబాయ్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021లో భాగంగా మరికొద్ది సేపట్లో దుబాయ్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్, సన్రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడనున్నాయి. దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది. ఐపీఎల్ 2021 ఫస్టాఫ్లో దుమ్మురేపిన ఢిల్లీతో సన్రైజర్స్ అమితుమీ తేల్చుకోనుంది. ప్లే ఆఫ్ రేసులో నిలవాలంటే.. ఇకపై ప్రతి మ్యాచ్ గెలవాల్సిన పరిస్థితి ఆరెంజ్ ఆర్మీది. అయితే ఈ మ్యాచ్కు ముందు కొన్ని రికార్డులు ఇరు జట్లలోని పలువురు ఆటగాళ్లను ఊరిస్తున్నాయి. ఆ రికార్డులు ఏంటో ఓసారి చూద్దాం.
ఈ మ్యాచ్ ద్వారా ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాట్స్మన్ అజింక్య రహానే, సీనియర్ స్పిన్నర్ అమిత్ మిశ్రా.. సన్రైజర్స్ హైదరాబాద్ వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా ఓ మైలురాయిని అందుకునే అవకాశాలున్నాయి. ఈ మ్యాచ్తో మిశ్రా.. ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున 100 మ్యాచ్లు ఆడిన తొలి ఆటగాడిగా నిలవనున్నాడు. మొదటి నుంచి మిశ్రా.. ఢిల్లీ డేర్ డెవిల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ మైలురాయి అందుకోనున్నాడు. ఇప్పటివరకు 166 వికెట్లు తీసిన మిశ్రా.. మరో 5 వికెట్లు తీస్తే లీగ్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా రికార్డుల్లో నిలవనున్నాడు. ప్రస్తుతం శ్రీలంక మాజీ పేసర్ లసిత్ మలింగ 170 వికెట్లతో తొలి స్థానంలో ఉన్నాడు.
సన్రైజర్స్ హైదరాబాద్ వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్మన్ వృద్ధిమాన్ సాహా ఈ మ్యాచ్లో 13 పరుగులు చేస్తే ఇండియన్ ప్రీమియర్ లీగ్లో 2000 పరుగులు పూర్తి చేస్తాడు. ఇప్పటివరకు 126 మ్యాచులు ఆడిన సాహా 1987 రన్స్ చేశాడు. ఇందులో ఒక సెంచరీ, 8 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అత్యధిక స్కోర్ 115 నాటౌట్. మంగళవారం రాజస్థాన్ రాయల్స్ జట్టుతో జరిగిన మ్యాచులో పంజాబ్ కింగ్స్ ఓపెనర్ మయాంక్ అగర్వాల్ 2000 వేల పరుగులను పూర్తిచేశాడు. ఇక ఐపీఎల్ లీగ్లో 4000 పరుగులు పూర్తి చేయడానికి ఢిల్లీ క్యాపిటల్స్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మన్ అజింక్య రహానేకు ఇంకా 59 పరుగులు అవసరం. ఈ రోజు జింక్స్ ఓ భారీ ఇన్నింగ్స్ ఆడితే.. 4వేల పరుగులు చేయనున్నాడు.
తొలి దశలో ఆడిన 8 మ్యాచ్ల్లో 6 నెగ్గి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ మంచి ఊపుమీద ఉంది. కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ గైర్హాజరీలో రిషబ్ పంత్ జట్టును ముందుండి నడిపించాడు. అయ్యర్ కూడా జట్టుతో చేరడంతో ఢిల్లీ మరింత బలంగా కనిపిస్తోంది. ధావన్, రబాడ,హెట్మెయర్, స్టోయినిస్ లాంటి ఆటగాళ్లు ఫామ్లో ఉండటం ఆ జట్టుకు కలిసొచ్చే అంశం. ఫామ్ లేమితో ఇబ్బందులు పడుతున్న సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ఈరోజు మరో షాక్ తగిలింది. ఫాస్ట్ బౌలర్ తంగరసు నటరాజన్కు కొవిడ్ పాజిటివ్గా నిర్ధరణ అయ్యింది. నేటి మ్యాచ్లో నటరాజన్కు అందుబాటులో లేకపోవడం ఆ జట్టుకు పెద్ద దెబ్బే. నటరాజన్తో పాటు విజయ్ శంకర్ కూడా దూరమయ్యాడు.