
మహిళల ప్రీమియర్ లీగ్లో మొట్టమొదటి సెంచరీ భాగస్వామ్యం నెలకొంది. ఈ లీగ్ ప్రారంభమైన రెండో రోజే డబ్ల్యూపీఎల్లో ఎంటర్టైన్మెంట్ ఐపీఎల్కు ఏమాత్రం తీసిపోదని మరోసారి రుజువైంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన మ్యాచ్లో పరుగుల వరద పారింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న బెంగళూరు కెప్టెన్ స్మృతి మంధాన.. కాసేపటిక తన నిర్ణయం తప్పని అర్థం చేసుకుంది.
టాస్ ఓడి బ్యాటింగ్కు వచ్చిన ఢిల్లీ జట్టు చెలరేగింది. షెఫాలీ వర్మ (45 బంతుల్లో 84), మెగ్ లానింగ్ (42 బంతుల్లో 72) ధనాధన్ ఆటతో ఆ జట్టుకు అదిరిపోయే ఓపెనింగ్ అందించారు. ఆరంభం నుంచే భారీ షాట్లతో విరుచుకుపడిన వీళ్లిద్దరూ ఆకాశమే హద్దుగా చెలరేగారు. దీంతో ఆర్సీబీ బౌలర్లు తేలిపోయారు. వాళ్లు ఎంత కష్టపడినా ఢిల్లీ ఓపెనర్లు మాత్రం బౌండరీలపై బౌండరీలు బాదుతూనే ఉన్నారు. ఈ క్రమంలోనే డబ్ల్యూపీఎల్లో తొలి సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పారు.
షెఫాలీ, లానింగ్ ఇద్దరూ తొలి వికెట్కు ఏకంగా 162 పరుగులు జతచేశారు. ఆ తర్వాత హెదర్ నైట్ వీళ్లిద్దర్నీ ఒకే ఓవర్లో పెవిలియన్ చేర్చింది. అయితే ఆ తర్వాత వచ్చిన జెమీమా రోడ్రిగెజ్ (15 బంతుల్లో 22 నాటౌట్), మారిజానే కాప్ (17 బంతుల్లో 39 నాటౌట్) కూడా వేగంగా పరుగులు చేశారు. దీంతో ఢిల్లీ జట్టు సులభంగా 200 పరుగుల మార్కు దాటింది. ఈ మ్యాచ్ ఆరంభం నుంచి ఆధిక్యంలో నిలిచిన ఢిల్లీ.. కేవలం హెదర్ నైట్ రెండు వికెట్లు తీసుకున్నప్పుడే కొంత తడబడినట్లు కనిపించింది. కానీ రోడ్రిగెజ్, కాప్ ఇద్దరూ ఆ ఆశలు కూడా ఆవిరి చేస్తూ భారీ షాట్లు ఆడారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో కేవలం రెండు వికెట్ల నష్టానికి 223 పరుగుల భారీ స్కోరు చేసింది. ఆర్సీబీలో కేవలం నైట్ మాత్రమే రెండు వికెట్లు తీసుకుంది.