రెండు సార్లు ఔట్:
టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ సారథి ఎంఎస్ ధోనీ వికెట్ తీసుకోవడాన్ని చాలా మంది బౌలర్లు గొప్ప ఫీట్గా భావిస్తారు. అయితే మహీ వికెట్ మాత్రం అంత సులభంగా దక్కదు. అలాంటిది ఐపీఎల్ 2021లో ధోనీని యువ పేసర్ అవేశ్ ఖాన్ రెండు సార్లు ఔట్ చేశాడు. తొలి ఫేజ్లో ధోనీని డకౌట్ చేసిన ఈ బౌలర్.. యూఏఈలో జరుగుతున్న రెండో ఫేజ్లో కూడా మహీని ఒకసారి పెవిలియన్ పంపాడు. అయితే ధోనీని ఇలా అవుట్ చేయడంలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కెప్టెన్ రిషబ్ పంత్ కీలక పాత్ర పోషించాడని అవేశ్ చెప్పాడు. పంత్ చెప్పిన ప్లాన్ను తాను మొదటగా విభేదించానని, ఆ తర్వాత అతడే కరెక్ట్ అనుకున్నానని అవేశ్ చెప్పాడు.
ముందుగా ఒప్పుకోలేదు:
'మహీ భాయ్ బ్యాటింగ్కు రాగానే మిడాన్, మిడాఫ్ ఫీల్డర్లను 30 యార్డ్ సర్కిల్ లోపలకు తీసుకురావాలని రిషబ్ పంత్ చెప్పాడు. వాళ్లపై నుంచి ధోనీ షాట్లు కొడితే ఏం పర్వాలేదు అన్నాడు. అయితే ఫుల్ లెంగ్త్లో బంతులేయద్దని మాత్రం చెప్పాడు. నేను దానికి ముందుగా ఒప్పుకోలేదు. ఇక సర్కిల్ లోపలకు ఐదుగురు ఫీల్డర్లను తీసుకురావొద్దని చెప్పా. కానీ పంత్ వినలేదు. ఆ తర్వాత నేను వేసిన రెండో బంతినే ఆ ఫీల్డర్ల పైనుంచి బాదడానికి ధోనీ భాయ్ ప్రయత్నించాడు. అలా అతని వికెట్ దక్కింది' అని అవేశ్ ఖాన్ తాజాగా వెల్లడించాడు.
పంత్ ఒకటే మాట చెప్పాడు:
యూఏఈలో కూడా ఒకసారి చెన్నై కెప్టెన్ ఎంఎస్ ధోనీ వికెట్ కూల్చిన అవేశ్ ఖాన్.. అప్పుడు కూడా రిషబ్ పంత్ ప్లాన్ ఉందన్నాడు. 'అప్పుడు కూడా రిషబ్ పంత్తో మాట్లాడా. అతను ఒకటే మాట చెప్పాడు. హార్డ్ లెంగ్త్లో బంతులేయమన్నాడు. ఆ బంతులు ఆడటం కష్టం కాబట్టి ధోనీ భాయ్ షాట్లు ఆడినా పర్లేదని చెప్పాడు. అలా చేస్తే బంతి ఎడ్జ్ తీసుకోవడంతో వికెట్ దక్కింది' అని తన కెప్టెన్ పంత్ ప్లాన్ను అవేశ్ వివరించాడు. అయితే లీగ్ దశలో రెండు సార్లు అవేశ్ బౌలింగ్లో ఔట్ అయిన మహీ.. క్వాలిఫైయర్-1లో మాత్రం చెలరేగాడు. అతడి బౌలింగ్లో 84 మీటర్ల భారీ సిక్స్ బాది ప్రతీకారం తీర్చుకున్నాడు. ఇక ఈ రోజు (బుధవారం) కోల్కతా నైట్ రైడర్స్తో ఢిల్లీ క్యాపిటల్స్ రెండో క్వాలిఫైయర్ ఆడుతుంది. ఈ మ్యాచ్లో గెలిస్తే ఫైనల్లో మరోసారి చెన్నైను ఢీకొంటుంది.
బీసీసీఐ నుంచి పిలుపు:
ఐపీఎల్ 2021లో సత్తా చాటుతున్న పేసర్ అవేష్ ఖాన్కు బీసీసీఐ నుంచి పిలుపొచ్చింది. నెట్ బౌలర్గా చేరాల్సిందిగా బీసీసీఐ అతడికి సమాచారం ఇచ్చింది. ఆదివారం ప్రారంభం కానున్న టీ20 ప్రపంచకప్ స్టాండ్బై జాబితాలో అవేశ్ కూడా చోటు దక్కించుకునే అవకాశాలున్నట్లు సమాచారం. 'భారత జట్టుతో చేరాల్సిందిగా జాతీయ సెలక్టర్ల నుంచి అవేష్కు పిలుపు వచింది. ప్రస్తుతం అతడిని నెట్ బౌలర్గానే తీసుకున్నారు. పరిస్థితిని బట్టి టీమ్ మేనేజ్మెంట్ అతడికి స్టాండ్ బైగా అవకాశం ఇవ్వొచ్చు. అవేష్ సగటున 142-145 కి.మీ వేగంతో బంతులు వేస్తున్నాడు. బ్యాటింగ్కు అనుకూలించే పిచ్లపై కూడా బౌన్స్ రాబడుతున్నాడు. అతడిని మా కోచ్లు కొంత కాలంగా గమనిస్తున్నారు' అని బీసీసీఐ వర్గాలు తెలిపాయి.