షార్ట్ ఆఫ్ లెంగ్త్ బాల్ని విసరమన్నాడు
తాజాగా అవేష్ ఖాన్ 'ది ఇండియన్ ఎక్స్ప్రెస్'తో మాట్లాడుతూ... 'చెన్నైతో మ్యాచ్లో ఎంఎస్ ధోనీ క్రీజులోకి వచ్చే సమయానికి ఇంకా నాలుగు ఓవర్లు మిగిలి ఉన్నాయి. ఇన్నింగ్స్ చివరలో ఉంది కాబట్టి మహీ కచ్చితంగా హిట్టింగ్ చేస్తాడని రిషబ్ పంత్ నాతో చెప్పాడు. అదే సమయంలో గత నాలుగు నెలల నుంచి ఆటకి ధోనీ దూరంగా ఉన్న విషయాన్ని కూడా చెప్పాడు. దాంతో బంతిని వేగంగా మిడిల్ చేయలేకపోవచ్చనే హింట్ ఇచ్చాడు.
నన్ను షార్ట్ ఆఫ్ లెంగ్త్ బాల్ని విసరమని పంత్ సూచించాడు. నేను అతను చెప్పినట్లే బంతి విసరగా.. ధోనీ హిట్ చేసేందుకు ప్రయత్నించి బౌల్డయ్యాడు. నేను బౌలింగ్ కోసం రన్నప్తో వస్తున్న సమయంలోనే.. వికెట్ల వెనుక నుంచి పంత్ నాకు కొన్ని సిగ్నల్స్ ఇస్తుంటాడు. అతని సూచనల మేరకు బంతులేస్తూ వచ్చాను' అని తెలిపాడు.
రెండు బంతులు ఎదుర్కొని
ఐపీఎల్ 2021 సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లకు అదే తొలి మ్యాచ్. దాంతో ఎంఎస్ ధోనీ, రిషబ్ పంత్ ఆట, కెప్టెన్సీపై అందరూ ఆసక్తికనబరిచారు. చాలా రోజుల తర్వాత మైదానంలోకి దిగిన ధోనీ రెండు బంతులు ఎదుర్కొని డకౌట్గా వెనుదిరిగాడు. దాంతో అవేష్ ఖాన్ హీరో అయ్యాడు. ఆ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై 188 పరుగులు చేయగా.. లక్ష్యాన్ని 18.4 ఓవర్లలోనే ఢిల్లీ ఛేదించేసింది. పృథ్వి షా (72), శిఖర్ ధావన్ (85) హాఫ్ సెంచరీలు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు.
పలు జట్లలో కరోనా కేసులు నమోదవడంతో గత మంగళవారం టోర్నీని బీసీసీఐ నిరవధికంగా వాయిదా వేసిన విషయం తెలిసిందే. లీగ్ నిలిచేసమయానికి 12 పాయింట్లతో ఢిల్లీ అగ్రస్థానంలో ఉంది.
తల్లి కాబోతున్న స్టార్ క్రికెటర్ కాబోయే భార్య.. శుభాకాంక్షలు చెప్పిన కేకేఆర్!!
మహీ భాయ్ వికెట్ నా కల
ఇటీవల ఎంఎస్ ధోనీ వికెట్ తీయడంపై స్పందించిన అవేశ్ ఖాన్.. అది తన డ్రీమ్ అని, ఇన్నాళ్లకు నెరవేరిందని సంతోషం వ్యక్తం చేశాడు. 'మూడేళ్ల క్రితం 2018లో మహీ భాయ్ వికెట్ తీసే అవకాశం వచ్చింది. కానీ కొలిన్ మున్రో క్యాచ్ డ్రాప్ చేయడంతో నిరాశే ఎదురైంది. మహీ భాయ్ వికెట్ తీయాలన్న నా కల అలాగే మిగిలిపోయింది. కానీ ఇప్పుడు.. మూడు సంవత్సరాల తర్వాత అది నెరవేరింది. ఇందుకు నేను ఎంతో సంతోషిస్తున్నాను. మహీ భాయ్ కొన్ని రోజులుగా క్రికెట్కు దూరంగా ఉన్నాడు. మ్యాచ్లు ఆడలేదు. కాబట్టి అతనిపై ఒత్తిడి మరింతగా పెంచి, వికెట్ తీయాలని ఢిల్లీ టీమ్ మేనేజ్మెంట్ ప్రణాళికలు రచించింది. వాటిని నేను సమర్థవంతంగా అమలు చేయగలిగా' అని అవేశ్ పేర్కొన్నాడు.
ఉమేష్, ఇషాంత్ ఉన్నా
దేశవాళీ టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో దుమ్మురేపిన అవేశ్ ఖాన్.. కేవలం ఐదు మ్యాచ్ల్లో 14 వికెట్లు తీసి సత్తా చాటాడు. అదే ఫామ్ను ఐపీఎల్ 2021లోనూ కొనసాగిస్తూ.. ఢిల్లీ కెప్టెన్ రిషబ్ పంత్ నమ్మకాన్ని నిలబెట్టాడు. టోర్నీ ఆరంభంలో కగిసో రబడా, అన్రిచ్ నోర్జ్ గైర్హాజరీ నేపథ్యంలో అవకాశం దక్కించుకున్న అవేశ్ అద్భుత బౌలింగ్తో ఆకట్టుకున్నాడు. జట్టులో సీనియర్ బౌలర్ ఉమేశ్ యాదవ్, ఇషాంత్ శర్మ ఉన్నా.. నయా కెప్టెన్ పంత్ ఈ యువ పేసర్పై నమ్మకం ఉంచి అవకాశం ఇచ్చాడు. గత రెండు సీజన్లుగా అతడు నిలకడగా రాణిస్తున్న విషయం తెలిసిందే.