
మహిళల ప్రీమియర్ లీగ్లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ తలపడ్డాయి. ఈ మ్యాచ్లో టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ఢిల్లీ అద్భుతంగా ఆడింది. ఓపెనర్లు షెఫాలీ వర్మ (84), మెగ్ లానింగ్ (72) ఆ జట్టుకు సూపర్ ఓపెనింగ్ అందించారు. వీళ్లిద్దరే తొలి వికెట్కు 162 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. ఆ తర్వాత వచ్చిన జెమీమా రోడ్రిగెజ్ (22 నాటౌట్), మారిజానే కాప్ (39 నాటౌట్) కూడా చక్కగా బ్యాటింగ్ చేశారు. దీంతో ఢిల్లీ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 223 పరుగుల భారీ స్కోరు చేసింది.
ఇంత పెద్ద టార్గెట్తో బరిలో దిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు కూడా శుభారంభమే దక్కింది. స్మృతి మంధాన (35), సోఫీ డివైన్ (14) మంచి షాట్లు ఆడారు. ఆ తర్వాత వచ్చిన ఎలీస్ పెర్రీ (31) కూడా రాణించింది. అయితే దిశా కసత్ (9), రిచా ఘోష్ (2), కనిక అహూజా (0), శోభనా ఆశ (2) విఫలమయ్యారు. చివర్లో మేగన్ షూట్ (30 నాటౌట్), హెదర్ నైట్ (34) బాగా ఆడారు. మంధాన, డివైన్ తర్వాత వీళ్లిద్దరే మంచి భాగస్వామ్యం నెలకొల్పారు. కానీ చివరకు మాత్రం ఆర్సీబీ విజయం సాధించలేకపోయింది.
కళ్లు ముందు భారీ లక్ష్యం ఉండటంతో ఆర్సీబీ మిడిలార్డర్ తడబడింది. అనవసరంగా భారీ షాట్లు ఆడేందుకు ప్రయత్నించి వరుసగా పెవిలియన్ చేరారు. ఆర్సీబీ బ్యాటర్లలో ఎలీస్ పెర్రీ తప్ప అందరూ భారీ షాట్లు ఆడేందుకు ప్రయత్నించి క్యాచ్ అవుట్ అయిన వాళ్లే కావడం గమనార్హం. దీన్ని చక్కగా క్యాష్ చేసుకున్న ఢిల్లీ పేసర్ టారా నోరిస్ ఏకంగా ఐదు వికెట్లతో చెలరేగింది. ఆమెతోపాటు అలైస్ క్యాప్సీ రెండు, శిఖ పాండే ఒక వికెట్ తీసుకున్నారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో ఆర్సీబీ 8 వికెట్లు కోల్పోయిన కేవలం 168 పరుగులు మాత్రమే చేయగలిగింది. బంతితో, బ్యాటుతో రాణించిన ఢిల్లీ ఏకంగా 60 పరుగుల తేడాతో విజయం సాధించింది.