హైదరాబాద్: రాంచీ టెస్టులో తొలి రోజు ఆటలో భాగంగా కోహ్లీకి అయిన భుజం గాయంపై మూడో రోజు ఆస్ట్రేలియా ఆటగాడు గ్లెన్ మ్యాక్స్వెల్ నవ్వులు పూయించాడు. వివరాల్లోకి వెళితే తొలి రోజు ఆటలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ భుజం గాయమైన సంగతి తెలిసిందే.
కోహ్లీ భుజాన్ని స్కానింగ్ తీయడంతో ప్రమాదం ఏమీ లేదని, అతడికి విశ్రాంతి కావాలని ఫిజియో సూచించాడు. దీంతో శుక్రవారం కోహ్లీ డ్రస్సింగ్ రూమ్కే పరిమితమయ్యాడు. శుక్రవారం ఉదయం టీమిండియాతో కలిసి ప్రాక్టీస్లో పాల్గొన్న కోహ్లీ ఆటకు మాత్రం దూరమయ్యాడు.
అయితే తొలి రోజు కోహ్లీ భుజానికి గాయం అయిన తర్వాత ఎలాగైతే ఇబ్బంది పడ్డాడో అదేవిధంగా మూడో రోజు ఆటలో ఆసీస్ ఆటగాడు గ్లెన్ మ్యాక్స్వెల్ ప్రవర్తించాడు. కమ్మిన్స్ వేసిన ఇన్నింగ్స్ 80.3 ఓవర్లో పుజారా అడిన షాట్ను బౌండరీ లైన్ వద్ద మ్యాక్స్వెల్ ఆపేందుకు ప్రయత్నించాడు.
ఈ సమయంలో కోహ్లీని అనుకరిస్తూ మ్యాక్స్వెల్ చేయడం అభిమానులను నవ్వుల్లో ముంచెత్తింది. ఇదిలా ఉంటే రాంచీ టెస్టులో కోహ్లీ స్థానంలో వైస్ కెప్టెన్ రహానె కెప్టెన్సీ బాధ్యతలు నిర్వహించిన సంగతి తెలిసిందే. కాగా, కాగా, తొలి ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా 451 పరుగులకు ఆలౌటైంది.
ఇక మూడో రోజు ఆటలో కోహ్లీ బ్యాటింగ్పై సందిగ్ధంగా మారింది. అయితే శనివారం ఉదయం నెట్స్లో బ్యాటింగ్ ప్రాక్టిసు చేసిన కోహ్లీ నాలుగో స్ధానంలో బ్యాటింగ్కు దిగాడు. మైదానంలోకి విరాట్ కోహ్లీ అడుగుపెట్టగానే 'కోహ్లీ.. కోహ్లీ.. కోహ్లీ' అంటూ అభిమానులు అరిచారు.
82 పరుగుల వద్ద మురళీ విజయ్ అవుటైన తర్వాత కోహ్లీ క్రీజులోకి వచ్చాడు. త రెండు టెస్టుల్లో 0, 13, 12, 15 స్వల్ప స్కోర్లకే కోహ్లీ వెనుదిరిగాడు. దీంతో మూడో టెస్టులో సెంచరీ చేయాలనే పట్టుదలతో ఉన్నాడు. అయితే మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్లో కూడా కోహ్లీ నిరాశపర్చాడు.
మళ్లీ నిరాశపర్చిన కోహ్లీ
రాంచీ టెస్టులో టీమిండియా మూడో వికెట్ కోల్పోయింది. ఎన్నో అనుమానాల మధ్య బ్యాటింగ్కు దిగిన కోహ్లీ అభిమానులను తీవ్రంగా నిరాశపరిచాడు. ఆసీస్ పేసర్ కమ్మిన్స్ బౌలింగ్లో స్టీవ్ స్మిత్కు క్యాచ్ ఇచ్చి విరాట్ కోహ్లీ పెవిలియన్కు చేరాడు. 23 బంతులను ఎదుర్కొన్న కోహ్లీ 6 పరుగుల వద్ద పెవిలియన్కు చేరాడు.