హైదరాబాద్: ఇంగ్లీషు గడ్డపై ఆతిథ్య జట్టును ఘోరంగా ఓడించిన భారత జట్టుపై ఆ ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ డేవిడ్ విల్లీ విమర్శలు గుప్పించాడు. జట్టు విజయంలో కీలకంగా వ్యవహరించిన బౌలర్లను టార్గెట్గా వ్యాఖ్యానించాడు. భారత బౌలర్లు తొలి టీ20లో క్రీడా స్ఫూర్తి మరిచి ఆడారని ఎద్దేవా చేశాడు. మంగళవారం రాత్రి జరిగిన తొలి టీ20 మ్యాచ్లో భువనేశ్వర్ కుమార్, కుల్దీప్ యాదవ్ దాదాపు నాలుగు సార్లు బౌలింగ్ సమయంలో రనప్ని ఆపేసి.. మళ్లీ వెనక్కి వెళ్లిన సంగతి గుర్తు చేశాడు.
వారు అలా చేయడానికి కారణం.. బ్యాట్స్మెన్ ఏకాగ్రతని దెబ్బతీయడానికే.. అలా అసహనానికి గురిచేసి విజయాన్ని సాధించగలిగారని విల్లీ ఆరోపించాడు. ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్లో భువనేశ్వర్ రనప్ ఆపి.. వెనక్కి వెళ్తుండగా క్రీజులో ఉన్న డేవిడ్ విల్లీ అతనివైపు కోపంగా చూశాడు. దీనికి భువీ కూడా ఏంటి..? అని అసహనంగా స్పందించాడు.
'నేను షాట్ కొట్టేందుకు రెడీ అయ్యానని ఊహించే భువనేశ్వర్ రనప్ ఆపేశాడు. అంతకముందు కుల్దీప్ యాదవ్ కూడా అలా రెండు మూడుసార్లు చేశాడు. క్రికెట్ నిబంధనలు ఏం చెప్తాయో..? తెలీదు. కానీ.. భారత బౌలర్లు మాత్రం క్రీడాస్ఫూర్తి తప్పారు. ఇక్కడ వారి తప్పుల్ని ఎత్తి చూపాలని ఉద్దేశం కాదు. ఇంకా చెప్పాలంటే ఆ పని నాది కాదు' అని డేవిడ్ విల్లీ వెల్లడించాడు.
ఈ మ్యాచ్లో కుల్దీప్ యాదవ్ (5/24) కెరీర్లో అత్యుత్తమ ప్రదర్శనని కనబర్చగా.. కేఎల్ రాహుల్ సెంచరీ బాదడంతో భారత్ 8 వికెట్ల తేడాతో అలవోక విజయాన్ని అందుకుంది. ఇలా తొలి టీ20 విజయంతో.. శుక్రవారం జరగబోతున్న రెండో టీ20 మ్యాచ్కు ఇరుజట్లు సర్వం సిద్ధమైయ్యాయి.