ఆస్ట్రేలియా పర్యటనను వెస్టిండీస్ విజయంతో ముగించింది. పెర్త్ వేదికగా జరిగిన ఆఖరి టీ20లో ఆస్ట్రేలియాపై 37 పరుగుల తేడాతో గెలిచింది. మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లకు ఆరు వికెట్లకు 220 పరుగులు చేసింంది. ఆండ్రూ రసెల్ (71; 29 బంతుల్లో), రూథర్ఫర్డ్ (67*; 40 బంతుల్లో) అర్ధశతకాలతో విరుచుకుపడ్డారు. అనంతరం ఛేదనలో ఆస్ట్రేలియా 20 ఓవర్లలో అయిదు వికెట్లు కోల్పోయి 183 పరుగులే చేసింది. డేవిడ్ వార్నర్ (81; 49 బంతుల్లో) పోరాడాడు.
ఛేదనలో ఆస్ట్రేలియాకు శుభారంభం లభించింది. మిచెల్ మార్ష్ (17; 13 బంతుల్లో)తో కలిసి వార్నర్ తొలి వికెట్కు 68 పరుగులు జోడించాడు. వార్నర్ విధ్వంసానికి ఆసీస్ పవర్ప్లేలో 61 పరుగులు చేసింది. వన్డౌన్లో వచ్చిన ఆరోన్ (16; 16 బంతుల్లో) కలిసి వార్నర్ స్కోరుబోర్డు పరుగులు పెట్టించాడు. అయితే స్వల్పవ్యవధిలోనే వీరిద్దరు పెవిలియన్కు చేరారు.

అనంతరం క్రీజులో వచ్చిన జోస్ ఇంగ్లిస్ (1), గ్లెన్ మాక్స్వెల్ (12; 14 బంతుల్లో) కూడా విఫలమయ్యారు. ఆఖర్లో టిమ్ డేవిడ్ (41*; 19 బంతుల్లో) పోరాడినప్పటికీ కొండంత లక్ష్యాన్ని ఆసీస్ అందుకోలేకపోయింది. అయితే వార్నర్ క్రీజులో ఉన్నంతసేపు ఆస్ట్రేలియా ఫేవరేట్గానే నిలిచింది. విండీస్ బౌలర్లలో షెఫార్డ్, రోస్టన్ ఛేజ్ చెరో రెండు వికెట్లు, హోస్సేన్ ఒక వికెట్ పడగొట్టారు.
అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న వెస్టిండీస్ 17 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. చార్లెస్ (4; 6 బంతుల్లో), నికోలస్ పూరన్ (1; 3 బంతుల్లో), మేయర్స్ (11; 7 బంతుల్లో) వరుసగా పెవిలియన్కు చేరారు. ఈ దశలో బ్యాటింగ్కు వచ్చిన రోస్టన్ ఛేజ్ (37; 20 బంతుల్లో), కెప్టెన్ పావెల్ (21; 14 బంతుల్లో) దూకుడుగా ఆడుతూ రన్రేట్ను పెంచారు. కానీ ఎక్కవుసేపు క్రీజులో నిలవలేకపోయారు.
వారిద్దరు ఔటైన అనంతరం రూథర్ఫర్డ్తో కలిసి రసెల్ ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. ఆరో వికెట్కు 119 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో జేవియర్ రెండు వికెట్లు, బెహ్రెన్డాఫ్, స్పెన్సర్ జాన్సన్, హర్డీ, జంపా తలో వికెట్ తీశారు. రసెల్ దాడికి జంపా నాలుగు ఓవర్లలో 65 పరుగులు సమర్పించుకున్నాడు.కాగా, టెస్టు సిరీస్ను 1-1తో సమం చేసిన వెస్టిండీస్ వన్డే సిరీస్ను 0-3, టీ20 సిరీస్ను 1-2తో కోల్పోయింది.