హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో అద్భుతంగా రాణిస్తున్న ఆస్ట్రేలియా ఆటగాళ్లు డేవిడ్ వార్నర్, స్మిత్ వచ్చే ఐపీఎల్కు దూరం అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్ కథనం ప్రకారం క్రికెట్ ఆస్ట్రేలియా తమ కీలక ఆటగాళ్లకు జాతీయ కాంట్రాక్ట్లు అప్పజెప్పి వారిని ఐపీఎల్కు దూరం చేయనుంది.
ఐపీఎల్ ప్రత్యేక వార్తలు | ఐపీఎల్ పాయింట్ల పట్టిక | ఐపీఎల్ 2017 ఫోటోలు
ఐపీఎల్ కారణంగా ఆస్ట్రేలియా క్రికెటర్లు ఏడాదిలో దాదాపు రెండు నెలల పాటు దూరంగా ఉండటం ఆ క్రికెట్ బోర్డుకు రుచించడంలేదంట. ఇందులో భాగంగా కొత్త కాంట్రాక్ట్లు, వివిధ రకాల సుదీర్ఘ కాంట్రాక్ట్లు పేరుతో వారిని ఐపీఎల్కు దూరం చేయాలని క్రికెట్ ఆస్ట్రేలియా చూస్తోందట.

ఐపీఎల్కు దూరంగా ఉంచి తమకు అందుబాటులో ఉండేవిధంగా చేయాలని భావిస్తోంది. జట్టులోని ప్రధాన ఆటగాళ్లు తరచూ గాయాల బారిన పడటం కూడా క్రికెట్ ఆస్ట్రేలియాకు ఎంతమాత్రం మింగుడు పడటం లేదు. దాంతో ఆసీస్ జట్టులోని కీలక ఆటగాళ్లకు మూడేళ్ల సుదీర్ఘ కాంట్రాక్ట్ను అప్పచెప్పాలని చూస్తోంది.
ఈ కొత్త కాంట్రాక్టుల వల్ల ఆస్ట్రేలియా క్రికెటర్లు బిజీగా ఉండటంతో పాటు.. ఐపీఎల్ ద్వారా వచ్చే ఆదాయం కంటే కూడా కాస్త ఎక్కువగానే లబ్ది పొందే అవకాశం ఉంది. కెప్టెన్ స్టీవ్ స్మిత్తో పాటు వైస్ కెప్టెన్ డేవిడ్ వార్నర్, ఫాస్ట్ బౌలర్లు మిచెల్ స్టార్క్, హజల్ వుడ్, ప్యాట్ కమిన్స్ వంటి కీలక ఆటగాళ్లకు ఇలాంటి కాంట్రాక్ట్ను కట్టబెట్టనుంది.
ఈ మేరకు సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్ ఓ కథనాన్ని రాసుకొచ్చింది. ఇదిలా ఉంచితే, ఈ కాంట్రాక్ట్ పద్ధతిని కొంతమంది ఆసీస్ క్రికెటర్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారంట. ఈ తరహా కాంట్రాక్ట్ క్రికెట్ ఆస్ట్రేలియాకు మాత్రమే లబ్ది చేకూర్చేదిగా ఉందని, ఇందుకు తాము సమ్మతంగా లేమని ఇప్పటికే బోర్డుకు పలువురు క్రికెటర్లు స్సష్టం చేసినట్లు తెలుస్తోంది.