మరో రెండు రోజుల్లో తన కెరీర్లో చివరి టెస్టు ఆడుతున్న ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ సంచలన ప్రకటన చేశాడు. వన్డేలకు కూడా వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించాడు. ఇదే సరైన సమయంగా భావిస్తున్నాని తెలిపాడు. అయితే ఫామ్, ఫిట్నెస్తో ఉంటే 2025లో జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీకి అందుబాటులో ఉంటానని వివరించాడు.
''వన్డే క్రికెట్ నుంచి రిటైర్ అవుతున్నా. భారత్లో ప్రపంచకప్ను సాధించాం. అది ఎంతో గొప్ప విషయం. వన్డేలకు కూడా వీడ్కోలు పలకడం సరైన నిర్ణయంగా భావిస్తున్నా. ఈ నిర్ణయంతో ప్రపంచవ్యాప్తంగా లీగ్లు ఆడేందుకు వీలు ఉంటుంది. అలాగే జట్టులో మరికొందరికి అవకాశం లభించి మరింత ముందుకు వెళ్తుంది. 2025లో ఛాంపియన్స్ ట్రోఫీ ఉంది.అయితే ఈ రెండేళ్లలో ఫామ్తో పరుగులు సాధిస్తుంటే, జట్టుకు నేను అవసరమని భావిస్తే.. అందుబాటులో ఉంటా''

''నా నిర్ణయం స్వేచ్ఛగానే తీసుకున్నా. మాకు ఎదురైన పరిస్థితుల్లో భారత్లో విజేతగా నిలబడటం ఓ అద్భుతం. ప్రపంచకప్లో వరుసగా మేం తొలి రెండు మ్యాచ్లు ఓడిపోయాం. అప్పుడు ఒకరికొకరు అండగా నిలుస్తూ విజయాలు సాధించాం. మాక్స్వెల్ వీరోచిత పోరాటం, భారత్తో జరిగిన ఫైనల్, దక్షిణాఫ్రికాతో జరిగిన సెమీఫైనల్ కమిన్స్ ఆటతీరు, కెప్టెన్సీ ఎంతో గొప్పగా ఉంది'' అని వార్నర్ మాట్లాడాడు.
ఆస్ట్రేలియా తరపున వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన ఆరో బ్యాటర్ డేవిడ్ వార్నర్. 161 మ్యాచ్ల్లో 45 సగటుతో 6932 పరుగులు చేశాడు. అలాగే అత్యధిక వన్డే సెంచరీలు సాధించిన రెండో ఆసీస్ ప్లేయర్గా వార్నర్ నిలిచాడు. వన్డేల్లో రికీ పాంటింగ్ 29 సెంచరీలు సాధించగా, వార్నర్ 22 శతకాలు సాధించాడు. మరోవైపు జనవరి 03న సిడ్నీ వేదికగా వార్నర్ ఆఖరి టెస్టును ఆడుతున్నాడు. కాగా, వన్డేలు, టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన వార్నర్ టీ20ల్లో కొనసాగనున్నాడు. అలాగే ఇతర ఫ్రాంచైజీ లీగుల్లో పాల్గొనున్నాడు.