
ఏదైనా సమాచారం ఉంటే చెప్పండి:
2018లో దక్షిణాఫ్రికాతో మూడో టెస్టు సందర్భంగా తాను బంతికి ఉప్పుకాగితం రాయడం తమ బౌలర్లకు కూడా ముందే తెలుసని కామెరూన్ బాన్క్రాఫ్ట్ తాజాగా అన్నాడు. దాంతో క్రికెట్ ఆస్ట్రేలియా మరోసారి దానిపై విచారణ చేపట్టింది. ఈ విషయంపై ఇంకా ఏదైనా సమాచారం ఉంటే తెలియజేయాలని తమ ఆటగాళ్లను కోరింది. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా యాజమాన్యం అప్పుడు చేపట్టిన విచారణ హాస్యాస్పదమైందని డేవిడ్ వార్నర్ మేనేజర్ జేమ్స్ ఎర్స్కైన్ అన్నాడు. ఆ ముగ్గురికీ శిక్ష వేసినప్పుడు.. వాళ్లు న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే తప్పకుండా కేసు గెలిచేవారన్నాడు. క్రికెట్ ఆస్ట్రేలియా ఆటగాళ్లందర్నీ విచారించలేదని, ఏకపక్షంగా నిర్ణయం తీసుకుందని ఆయన స్పష్టం చేశాడు.

కచ్చితంగా కేసు గెలిచేవారు:
ఆస్ట్రేలియా మీడియాతో జేమ్స్ ఎర్స్కైన్ మాట్లాడుతూ... 'అప్పటి విచారణలో ఆసీస్ ఆటగాళ్లందర్నీ సీఏ విచారించలేదు. ఆ ప్రక్రియను సరిగ్గా నిర్వర్తించలేకపోయింది. అదో హాస్యాస్పదమైన విషయం. అప్పుడు జరిగిందనే విషయం నాకు తెలుసు. ఇప్పుడు దాన్ని బయటపెట్టినా.. ఏ ప్రయోజం లేదు. ఎందుకంటే ఆస్ట్రేలియా ప్రజలు కొంతకాలం తర్వాత తమ జట్టును ఇష్టపడటం లేదు. అప్పుడు వార్నర్, స్మిత్, బాన్క్రాఫ్ట్ పట్ల హేయమైన రీతిలో వ్యవహరించారు. వాళ్లు చేసింది తప్పే అయినా.. ఆ శిక్ష సరైందికాదు. ఆ ముగ్గురు గనుక టాంపరింగ్ విషయంలో న్యాయపరంగా వెళ్లి ఉంటే.. కచ్చితంగా కేసు గెలిచేవారు. ఎందుకంటే నిజం అలాంటిది' అని అన్నాడు.

సరైన సమయం కోసం ఎదురుచూస్తున్నా:
బాల్ టాంపరింగ్ విషయంపై తాజాగా ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైఖేల్ క్లార్క్ స్పందించాడు. టాంపరింగ్ విషయంలో ఆ ముగ్గురితో పాటు ఇంకా ఎవరికైనా ముందే దాని గురించి తెలిస్తే.. అందులో ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్నాడు. మాజీ వికెట్ కీపర్ ఆడమ్ గిల్క్రిస్ట్ స్పందిస్తూ.. ఈ బాల్ టాంపరింగ్ వివాదం ఎప్పటికీ తెరమీదే ఉంటుందని, ఆ ఉదంతంలో అసలైన నిజం తెలియాలంటే మరింత లోతైన విచారణ చేపట్టాలన్నాడు. టాంపరింగ్ గురించి బాన్క్రాఫ్ట్ లాగే ఇంకొంత మందికీ తగిన సమాచారం తెలుసని, ఆ పేర్లను బయటపెట్టడం కోసం సరైన సమయం కోసం ఎదురుచూస్తున్నానన్నాడు.

ఏడాది పాటు నిషేధం:
2018లో దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ సందర్భంగా ఆస్ట్రేలియా ఆటగాళ్లు కామెరూన్ బాన్క్రాఫ్ట్, స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్.. బాల్ టాంపరింగ్కు పాల్పడిన సంగతి తెలిసిందే. ఆ ఉదంతం క్రికెట్ ప్రపంచంలో పెను దుమారం లేపింది. దాంతో బాన్క్రాఫ్ట్ తొమ్మిది నెలలు ఆటకు దూరమవ్వగా.. స్మిత్, వార్నర్ ఏడాది పాటు నిషేధానికి గురయ్యారు. టాంపరింగ్ కారణంగా ముగ్గురూ అనేక విమర్శలు ఎదుర్కొన్నారు. ఆసీస్ బోర్డు, మాజీలు, కుటుంబ సభ్యుల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. ఇక ఫాన్స్ ఆగ్రహానికి అడ్డేలేకుండా పోయింది. ఇప్పుడు ఏ వివాదం ఎటు పోతుందో చూడాలి.


Click it and Unblock the Notifications












