
విరాట్ చాలా థ్యాంక్స్:
తాజాగా డేవిడ్ వార్నర్ ముద్దుల కూతురు ఇండిరే.. విరాట్ కోహ్లీ జెర్సీని ధరించి ఫోటోకు ఫోజిచ్చింది. ఈ సందర్భంగా వార్నర్.. కోహ్లీకి థ్యాంక్స్ చెప్పాడు. 'మేం సిరీస్ ఓడిపోయామని మాకు తెలుసు.. కానీ ఒక్కసారి ఇక్కడ నవ్వుతున్న చిట్టితల్లిని చూస్తే ఆ బాధనంతా మరిచిపోతాం. విరాట్ నీ జెర్సీ నా కూతురుకి పంపినందుకు చాలా థ్యాంక్స్. నీ జెర్సీ ధరించి నా చిట్టితల్లి మురిసిపోతుంది' అంటూ క్యాప్షన్ జతచేశాడు. ఇదివరకు కూడా ఇండిరే కోహ్లీలా బ్యాటింగ్ చేసింది. ఖాళీ సమయాల్లో కూడా కోహ్లీని అనుకరిస్తుంటుంది.

పెటర్నటీ లీవ్పై కోహ్లీ స్వదేశానికి:
ఆసీస్ పర్యటనలో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని టీమిండియా 2-1 తేడాతో వరుసగా రెండోసారి గెలచుకొని చరిత్ర సృష్టించింది. చివరి టెస్టు జరిగిన గబ్బా మైదానంలో ఆసీస్ విధించిన 324 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించి ఆసీస్ 32 ఏళ్ల జైత్రయాత్రకు చెక్ పెట్టింది. ఈ సిరీస్లో తొలి టెస్టు తర్వాత పెటర్నటీ లీవ్పై విరాట్ కోహ్లీ స్వదేశానికి వచ్చేయగా.. చివరి రెండు టెస్టుల్లో మాత్రమే డేవిడ్ వార్నర్ ఆడాడు. కాగా ఆసీస్ పర్యటన ముగించుకొని స్వదేశానికి చేరుకున్న టీమిండియా ఫిబ్రవరి 5వ తేదీ నుంచి ఇంగ్లండ్తో తొలి టెస్టు ఆడనుంది. మరోవైపు ఆస్ట్రేలియా సిరీస్ ఆడేందుకు న్యూజిలాండ్లో పర్యటించనుంది.

భారత్లోనూ పెద్ద సంఖ్యలో అభిమానులు:
ఐపీఎల్లో సన్రైజర్స్ హైదరాబాద్కి ఆడుతున్న డేవిడ్ వార్నర్కి భారత్లోనూ పెద్ద సంఖ్యలో అభిమానులు ఉన్నారు. గత ఏడాది లాక్డౌన్ సమయంలో తెలుగు సినిమా సూపర్ హిట్ పాటలకి డ్యాన్స్ చేసిన వార్నర్.. టిక్టాక్ సెలబ్రిటీగా మారిపోయాడు. అల్లు అర్జున్, మహేష్ బాబుల పాపులర్ పాటలకు కాలుకదిపాడు. అతనితో పాటు ఫ్యామిలీ మెంబర్స్ కూడా కొన్ని పాటల్లో డాన్స్ విశేషం. వార్నర్ సతీమణి కాండీస్ కూడా బుట్టబొమ్మ పాటకు అద్భుతంగా డాన్స్ చేశారు. కూతుళ్లు ఇండిరే,ఇవిమే కూడా కొన్ని పాటలకు కాలుకదిపారు. దీంతో వార్నర్ ఫామిలీ టిక్టాక్ సెలబ్రిటీగా మారిపోయింది.

క్వారంటైన్లో కోహ్లీ:
విరాట్ కోహ్లీ ప్రస్తుతం ఇంగ్లాండ్ సిరీస్ కోసం సన్నద్ధమవుతున్నాడు. ఇప్పటికే చెన్నై చేరుకొని క్వారంటైన్ గడుపుతున్నాడు. మిగతా భారత ఆటగాళ్లు కూడా క్వారంటైన్లో ఉన్నారు. క్వారంటైన్ ముగిసిన అనంతరం ఫిబ్రవరి 2 నుంచి సాధన చేయనున్నారు. ఇంగ్లాండ్, టీమిండియా ఫిబ్రవరి 5-9 వరకు తొలి టెస్టు, 13-17 వరకు రెండో టెస్టు చెన్నైలోనే ఆడనున్న సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 24న అహ్మదాబాద్ వేదికగా మూడో టెస్ట్, ఇదే వేదికలో మార్చి 4న నాలుగో టెస్ట్ ప్రారంభంకానున్నాయి. ఇంగ్లాండ్ జట్టు సుదీర్ఘ భారత పర్యటనలో 4 టెస్ట్లు, 5 టీ20లు, 3 వన్డేలు ఆడనుంది.


Click it and Unblock the Notifications












