
భారత్తో నాలుగు టెస్టుల సిరీసులో ఆస్ట్రేలియా ఇప్పటికే రెండు మ్యాచుల్లో ఓటమిపాలైంది. మిగతా టెస్టుల్లో గెలవాలని, లేదంటే కనీసం డ్రా చేసుకోవాలని అనుకుంటున్న కంగారూలకు గట్టి షాక్ తగిలింది. ఇండోర్ వేదికగా జరగాల్సిన మూడో టెస్టుకు ముందు ఆ జట్టు స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ టీంకు దూరమయ్యాడు. రెండో టెస్టు సమయంలో మహమ్మద్ సిరాజ్ వేసిన బంతి వల్ల వార్నర్ తలకు గాయమైన సంగతి తెలిసిందే. దీంతో అతను ఆ మ్యాచ్లో ఆ తర్వాత ఆడలేదు. అతని స్థానంలో రెన్షాను ఆడించారు.
ఈ గాయంతో ఆస్పత్రికి వెళ్లిన వార్నర్కు విశ్రాంతి అవసరం అని వైద్యులు తేల్చారు. అలాగే వార్నర్ భుజం ఎముకకు కూడా గాయమైందని చెప్పారు. ఈ కారణంగా అతను భారత్తో జరిగే రెండు టెస్టులు ఆడే పరిస్థితి లేదని తెలుస్తోంది. దీనిపై ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు కూడా అధికారిక ప్రకటన చేసింది. 'భారత్లో టెస్టు టూర్ నుంచి డేవిడ్ వార్నర్ తప్పుకున్నాడు. అతను ఇంటికి వెళ్లిపోతున్నాడు. ఢిల్లీలో టెస్టు మ్యాచ్ సందర్భంగా బంతి అతని భుజాన్ని బలంగా తాకింది. దీంతో అక్కడి ఎముకకు గాయమైంది' అని క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) ప్రకటించింది. ఆసీస్ పేసర్ జోష్ హాజిల్వుడ్ కూడా గాయంతో ఈ సిరీస్కు దూరమైన సంగతి తెలిసిందే.
భుజం గాయంతో ఇంటికి వెళ్లిపోతున్న వార్నర్.. భారత్తో చివరి రెండు టెస్టులు ఆడటం లేదని, అయితే ఆ తర్వాత జరిగే వన్డే సిరీస్కు తిరిగి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. 'వార్నర్ గాయాన్ని పరిశీలించిన వైద్య నిపుణులు అతనికి విశ్రాంతి కావాలని చెప్పారు. దీంతో మిగతా టెస్టులకు అతను దూరం అవుతున్నాడు. అయితే ఆ తర్వాత జరిగే మూడు వన్డేల సిరీస్ నాటికి వార్నర్ కోలుకొని మళ్లీ జట్టులోకి కలిసే అవకాశం ఉంది' అని ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు తెలిపింది.