హైదరాబాద్: 'థ్యాంకూ ఇండియా. ఇండియా వచ్చి క్రికెట్ ఆడేందుకు తామంతా ఎదురు చూస్తుంటాం' ఆస్ట్రేలియాకు పయమమవుతూ ఆ జట్టు తాత్కాలిక కెప్టెన్ డేవిడ్ వార్నర్ తన ఇనిస్టాగ్రామ్లో పోస్టు చేసిన కామెంట్ ఇది. ఐదు వన్డేలు, మూడు టీ20ల సిరిస్ కోసం ఆస్ట్రేలియా భారత పర్యటనకు వచ్చిన సంగతి తెలిసిందే.
శుక్రవారంతో ఈ పర్యటన ముగిసింది. దీంతో ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు శనివారం ఆస్ట్రేలియాకు తిరుగు పయనమైంది. నిజానికి ఆస్ట్రేలియా క్రికెటర్లు భారత్ను తమ రెండో ఇంటిగా భావిస్తారు. ఇదే విషయాన్ని పలువురు ఆసీస్ క్రికెటర్లు గతంలో అనేకసార్లు చెప్పడాన్ని మనం చూశాం.
ఇక, డేవిడ్ వార్నర్ విషయానికి వస్తే ఇండియా అన్నా, హైదరాబాద్ అన్నా ఎంతో ఇష్టం. భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య పరిమిత ఓవర్ల సిరిస్ షెడ్యూల్ శుక్రవారంతో ముగిసింది. దీంతో భారత్లో పర్యటన ముగించుకున్న స్వదేశానికి వెళ్తోన్న డేవిడ్ వార్నర్ ఓ సందేశాన్ని పోస్టు చేశాడు.
'మరోసారి ఆతిథ్యం ఇచ్చిన భారత్కు ధన్యవాదాలు. ఇండియా వచ్చి క్రికెట్ ఆడేందుకు మేమంతా ఎంతగానో ఎదురుచూస్తూ ఉంటాం. గత రాత్రి హైదరాబాద్లో మ్యాచ్ ఆడలేకపోయినందుకు క్షమించండి. వచ్చే ఏడాది మిమ్మల్ని మళ్లీ కలుస్తా' అని వార్నర్ సెల్యూట్ చేస్తున్న ఫొటోను అభిమానులతో పంచుకున్నాడు.
A post shared by David Warner (@davidwarner31) on
ఐదు వన్డేల సిరిస్ను 4-1తో కోహ్లీ సేన కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. టీ20 సిరిస్ ఫలితాన్ని తేల్చే మూడో టీ20 రద్దు కావడంతో 1-1తో సిరిస్ సమమైంది. దీంతో సిరిస్ను ఇరు జట్లు పంచుకున్నాయి.