

హైదరాబాద్: దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా జట్ల మధ్య సఫారీ గడ్డపై జరుగుతోన్న టెస్టు సిరిస్ రసవత్తరంగా సాగుతోంది. బ్యాట్స్మెన్లు, బౌలర్ల మధ్య పోరు అభిమానులకు కనువిందు చేస్తోంది. తొలి టెస్టులో దక్షిణాఫ్రికా వికెట్ కీపర్ క్వింటన్ డికాక్తో తీవ్ర స్థాయిలో వాగ్వాదానికి దిగిన వార్నర్, మూడో టెస్టు రెండో రోజైన శుక్రవారం ఓ దక్షిణాఫ్రికా అభిమానితో వాగ్వాదానికి దిగాడు.
రబాడ బౌలింగ్లో వరుసగా ఐదు బౌండరీలు బాది విధ్వంసం సృష్టించిన వార్నర్ ఆ తర్వాత అతడి బౌలింగ్లోనే బౌల్డ్ అయ్యాడు. బౌండరీలైన్ను దాటి మెట్లపై నుంచి పెవిలియన్కు వెళ్తుండగా గ్యాలరీలో ఉన్న ఓ నడి వయసు అభిమాని వార్నర్కు చప్పట్లతో స్వాగతం పలుకుతూనే అతడిని రెచ్చగొట్టేలా మాట్లాడాడు.
అవేమీ పట్టించుకోకుండా వెళ్తున్న వార్నర్తో పాటు అభిమాని కూడా ముందుకు నడుచుకుంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నాడు. దీంతో కొంచెం ముందుకు వెళ్లాక వార్నర్ ఆగి ఆ అభిమానితో వాగ్వాదానికి దిగాడు. భద్రత సిబ్బంది వారించే ప్రయత్నం చేసినా ఎవరూ తగ్గలేదు. ఇద్దరి మధ్య బారికేడ్ అడ్డుగా ఉండటం విశేషం.
అయితే ఆట ముగిశాక వార్నర్ ఆ అభిమానిపై మ్యాచ్ రిఫరీకి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన ఆతిథ్య దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్లో 311 పరుగులకు ఆలౌటైంది. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన ఆస్ట్రేలియా బాన్క్రాఫ్ట్(77), వార్నర్(30), నాథన్ లయాన్(47) రాణించడంతో 9 వికెట్లకు 245 పరుగులు చేసింది.
తొలి ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా ఇంకా 66 పరుగుల వెనకబడి ఉంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి జోష్ హేజిల్వుడ్(1), టిప్ పైన్ (33) ఒక్క పరుగుతో క్రీజులో ఉన్నారు. అయితే అభిమానితో వార్నర్ గొడవకు దిగడంపై సోషల్ మీడియాలో నెటిజన్లు జోకులు వేస్తున్నారు.