
సిడ్నీ: మహమ్మారి కరోనా వైరస్ విజృంభణతో యావత్ ప్రపంచం అతలాకుతలం అవుతుండగా.. క్రీడా టోర్నీలన్నీ రద్దయ్యాయి. ఈ ప్రాణాంతక వైరస్ కట్టడికి అన్ని దేశాలు లాక్డౌన్ పాటిస్తున్నాయి. దీంతో స్టార్ క్రికెటర్లంతా ఇళ్లకే పరిమితమయ్యారు. ఈ క్వారంటైన్ సమయాన్ని కుటుంబ సభ్యులతో ఆస్వాదిస్తున్నారు. లాక్డౌన్ సమయంలో తమ కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతున్న వీడియోలు, ఫొటోలను క్రికెటర్లు సోషల్మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటున్నారు.
లాక్డౌన్ సమయంలో ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ తన కూతుళ్లతో కలిసి టిక్టాక్ వీడియోలు చేసుకుంటున్నాడు. మూడు రోజుల క్రితం తన కుమార్తె ఇవీతో కలిసి చేసిన వీడియోకి ఎవరైనా తమకు సహాయం చేయాలన్నాడు. 'మాకు టిక్టాక్పై అవగాహన లేదు. దీనిపై సాయం చేయండి. నా ఐదేళ్ల కూతురి కోసం టిక్టాక్ వీడియో చేస్తున్నా. ఇందులో నాకు ఫాలోవర్స్ కూడా లేరు' అని వార్నర్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఆ వీడియో పోస్ట్ చేశాడు.
వార్నర్ తాజాగా మరో టిక్టాక్ వీడియో చేశాడు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ సూపర్ హిట్ సాంగ్ 'షీలా కీ జవానీ'కి వార్నర్ స్టెప్పులు ఇరగదీశాడు. కూతురు ఇండీతో కలిసి డ్యాన్స్ అదరగొట్టేశాడు. దీన్ని కూడా ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో షేర్ చేశాడు. 'ఇండీ మీ కోసం ఇంకోసారి చేద్దామని అడిగింది' అనే క్యాప్షన్ ఇచ్చాడు. ప్రస్తుతం వార్నర్ పోస్ట్ చేసిన వీడియో వైరల్గా మారింది. దీన్ని పది గంటల్లో 6 లక్షల మందికిపైగా వీక్షించారు. 'వావ్, క్యూట్, మీరిద్దరు కత్రిన కంటే బాగా డ్యాన్స్ చేస్తున్నారు, ఇంకా సాధన చేయాలి, అద్భుతం.. భారతీయులకు మీరంటే చాలా ఇష్టం వార్నర్' అంటూ నెటిజన్లు రకరకాల కామెంట్లు చేశారు.
ఈ ఏడాది ఐపీఎల్ సీజన్కు సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుకు తిరిగి కెప్టెన్గా వార్నర్ ఎంపికయ్యాడు. గతంలో సన్రైజర్స్కు కెప్టెన్గా చేసిన వార్నర్.. ఆపై మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలతో ఏడాది కాలం క్రికెట్కు దూరమయ్యాడు. ఆ క్రమంలోనే ఐపీఎల్తో సహా ఎన్నో ఈవెంట్లను వార్నర్ మిస్సయ్యాడు. కాగా మళ్లీ వార్నర్కు సన్రైజర్స్ పగ్గాలు అప్పచెప్పింది.
కరోనా వైరస్ కారణంగా ఈ లీగ్ నిరవధిక వాయిదా పడింది. ముందస్తు షెడ్యూల్ ప్రకారం మార్చి 29వ తేదీన ఆరంభం కావాల్సిన ఐపీఎల్-13వ సీజన్ను తొలుత ఏప్రిల్ 15 వరకూ వాయిదా వేశారు. కరోనా వైరస్ ప్రభావం తగ్గకపోవడంతో.. ఐపీఎల్ను నిరవధిక వాయిదా వేస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. ఈ తరుణంలో ఐపీఎల్ జరగడం అనుమానంగా మారింది.