ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న భారత్-ఏ జట్టుకు ఊహించని సంఘటన ఎదురైన సంగతి తెలిసిందే. బంతిని మార్చడంపై వివరణ కోరిన భారత ఆటగాళ్లకు అంపైర్ల నుంచి అనూహ్యంగా బాల్ టాంపరింగ్ ఆరోపణలు ఎదురయ్యాయి. అంతేగాక అంపైర్తో ఇషాన్ కిషన్ వాగ్వాదం అక్కడి వాతావరణాన్ని మరింత వేడెక్కించింది. మీది చెత్త నిర్ణయం అంటూ ఇషాన్ అంపైర్పై ఘూట వ్యాఖ్యలు చేశాడు.
అయితే ఆ సంఘటన జరిగిన కొన్ని గంటలకే క్రికెట్ ఆస్ట్రేలియా (ఆసీస్ క్రికెట్ బోర్డు) భారత ఆటగాళ్లకు క్లీన్చిట్ ఇచ్చింది. అసలేం జరిగిదంటే.. ఆస్ట్రేలియా-ఏతో జరుగుతున్న అనధికారిక తొలి టెస్టు ఆఖరి రోజు ఆట ప్రారంభానికి కొద్దిసేపటి ముందు బంతి గురించి.. భారత-ఏ ఆటగాళ్లు అంపైర్ షాన్ క్రెయిన్ను ప్రశ్నించారు. అయితే దానికి అంపైర్ బదులిస్తూ బాల్ టాంపరింగ్ చేశారని భారత ఆటగాళ్లను ఆరోపించారు.

''మీరు బంతిని స్క్రాచ్ చేశారు. కాబట్టి మేం బాల్ను మార్చాం. దీనిపై ఇక ఎలాంటి చర్చ లేదు. ఆట కొనసాగించండి' అంటూ అంపైర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. దీని గురించి భారత్-ఏ జట్టు ఆటగాళ్లు స్పందిస్తుండగా.. అంపైర్ కఠినంగా బదులిచ్చాడు. 'చర్చించడానికి లేదు. ఆట ఆడండి. చర్చ చేయడానికి ఇక్కడ ఏం లేదు. ఈ బంతితో ఆటను కొనసాగించండి' అని అన్నారు.
దీనిపై వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ ఘూటుగా స్పందించాడు. అంపైర్ను 'నిజంగా.. నువ్వో చెత్త నిర్ణయం తీసుకున్నావు' అని ఇషాన్ అన్నాడు. దాంతో ఇషాన్ ప్రవర్తనపై కఠిన చర్యలు తీసుకుంటామని అంపైర్ హెచ్చరించారు. అయితే భారత్-ఏ జట్టుపై అంపైర్ క్రెయిగ్ చేసిన బాల్టాంపరింగ్ ఆరోపణల విషయంలో క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) వెనక్కి తగ్గింది. ''నాలుగో ఇన్నింగ్స్లో బంతి క్షీణించింది. అందుకే మార్చారు. దీనికి సంబంధించి తదుపరి చర్యలేమీ ఉండవు'' అని సీఏ పేర్కొంది.

దీనిపై తాజాగా ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ డేవిడ్ వార్నర్ స్పందించాడు. మరికొన్ని రోజుల్లో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ప్రారంభం కానుండటంతో వీలైనంత వేగంగా భారత్పై బాల్ టాంపరింగ్ ఆరోపణలను క్రికెట్ ఆస్ట్రేలియా కొట్టేసిందని పేర్కొన్నాడు. అయితే ఈ సంఘటనపై అంపైర్లు, మ్యాచ్ రిఫరీ మరింత వివరణ ఇవ్వాలని అన్నాడు. దీని గురించి సీఏ స్పష్టంగా ప్రకటన విడుదుల చేయాలని వార్నర్ తెలిపాడు. 2018లో బాల్ టాంపరింగ్ వివాదంతో డేవిడ్ వార్నర్ 12 నెలల నిషేధానికి గురైన సంగతి తెలిసిందే. కాగా, నవంబర్ 22 నుంచి ఆస్ట్రేలియాతో భారత్ అయిదు మ్యాచ్ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ జరగనుంది.