బసెటర్: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపిఎల్)-9లో అద్భుత ఫాంతో సన్రైజర్ హైదరాబాద్ జట్టుకు టైటిల్ అందించిన ఆసీస్ ఆటగాడు డేవిడ్ వార్నర్ తన ఫాంను కొనసాగిస్తున్నాడు. ప్రస్తుతం వెస్టిండీస్లో జరుగుతున్న ముక్కోణపు సిరీస్లో ఆసీస్ గెలుపులో కూడా కీలకంగా మారాడు.
దక్షిణాఫ్రికాతో వార్నర్ పార్క్ వేదికగా జరిగిన డే అండ్ నైట్ వన్డే మ్యాచ్లో ఓపెనర్ డేవిడ్ వార్నర్ (109: 120 బంతుల్లో 11×4, 2×6) శతకం బాదడంతో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 6 వికెట్ల నష్టానికి 288 పరుగులు చేసింది.

అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన దక్షిణాఫ్రికా జట్టులో హసీమ్ ఆమ్లా (60: 64 బంతుల్లో 6×4, 1×6), డుప్లెసిస్ (63: 76 బంతుల్లో 5×4) అర్ధశతకాలు బాదడంతో ఒకానొక దశలో 210/4తో నిలిచింది.
కానీ, చివర్లో వరుసగా వికెట్లు చేజార్చుకున్న సఫారీలు 47.4 ఓవర్లలో 252 పరుగులకే కుప్పకూలి 37 పరుగుల తేడాతో ఓటమిపాలయ్యారు. జెపి డుమిని 41, ఏబి డివిలియర్స్ 39 పరుగులతో రాణించినా జట్టును గెలుపు తీరాలకు చేర్చలేకపోయారు.
కాగా, శతకం బాదిన వార్నర్ 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్'గా ఎంపికయ్యాడు. సిరీస్లో భాగంగా తర్వాత మ్యాచ్ వెస్టిండీస్, ఆస్ట్రేలియా మధ్య సోమవారం రాత్రి మ్యాచ్ జరగనుంది. ఇప్పటి వరకు ఆస్ట్రేలియా రెండు విజయాలు సాధించగా, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్లు చెరో గెలుపున నమోదు చేశారు.