హైదరాబాద్: జీతాల విషయంలో క్రికెట్ ఆస్ట్రేలియా, ప్లేయర్స్ అసోసియేషన్ మధ్య వివాదం మరింత ముదురుతోంది. తమ షరతులకు లోబడి అంగీకారం తెలిపిన వారికి మాత్రమే కొత్త కాంట్రాక్ట్ను ఇస్తామంటూ క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) నిబంధనను ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ తీవ్రంగా తప్పుబట్టాడు.
ఛాంపియన్స్ ట్రోఫీ స్పెషల్ , ఫోటోలు , స్కోరు కార్డు
సీఏ కొత్త కాంట్రాక్టు విధానాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకునే ప్రసక్తే లేదని తేల్చి చెప్పాడు. జీతాల విషయంలో క్రికెట్ ఆస్ట్రేలియా దిగి రాకపోతే యాషెస్ సిరీస్ దూరంగా ఉండాలని పలువురు సీనియర్ ఆటగాళ్లు ఇప్పటికే క్రికెట్ ఆస్ట్రేలియాను హెచ్చరించిన సంగతి తెలిసిందే.
తాజాగా ఓపెనర్ డేవిడ్ వార్నర్ జులై 1 తర్వాత తమకు గనుకు కాంట్రాక్ట్ లేకపోతే క్రికెట్ను ఆడటం ఆపేస్తామని క్రికెట్ ఆస్ట్రేలియాకు గట్టి హెచ్చరిక చేశాడు. 'ఆసీస్ కొత్త విధానం ప్రకారం మేము నిరోద్యుగులమైతే కాంట్రాక్ట్లు కూడా ఉండవు అనేది మాకు తెలుసు. అప్పుడు క్రికెట్ ఆడటం కూడా జరగదు' అని ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఇంగ్లాండ్లో ఉన్న వార్నర్ మండిపడ్డాడు.

'క్రికెట్ ఆస్ట్రేలియా కచ్చితంగా కొత్త కాంట్రాక్ట్ విధానంపై అగ్రిమెంట్ చేయాలంటూ ఆటగాళ్లకు దగ్గరకు వస్తుంది. అప్పుడు మేము నిరుద్యోగులు అవుతామనే అనుకుంటున్నా. జూలై 1 తరువాత ఏమి జరుగుతుందో చూద్దాం. ప్రస్తుతం ఉన్న చాలా మంది కాంట్రాక్ట్ ఆటగాళ్ల కాంట్రాక్ట్ ను పునరుద్ధించేందుకు సీఏ సుముఖం లేదనేది ఈ మెయిల్స్ ద్వారా తెలుస్తుంది. ఇది చివరకు ఎక్కడ దారి తీస్తుందో అనేది కాలమే నిర్ణయిస్తుంది' అని వార్నర్ పేర్కొన్నాడు.
జీతాల విషయంలో క్రికెట్ ఆస్ట్రేలియా దిగి రాకపోతే యాషెస్ సిరీస్ దూరంగా ఉండాలని స్టార్క్లాంటి సీనియర్ ఆటగాళ్లు నిర్ణయం తీసుకున్నారు. ఈ సమ్మెకు షేన్ వాట్సన్, మిచెల్ జాన్సన్ లాంటి మాజీ క్రికెటర్లు కూడా మద్దతిస్తున్నారు. క్రికెట్ ఆస్ట్రేలియా కొత్తగా ప్రతిపాదించిన జీతాల విధానాన్ని క్రికెటర్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
మహిళా క్రికెటర్లతోపాటు అందరికీ భారీగా జీతాలు పెంచుతామని గత నెలలో క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) చీఫ్ జేమ్స్ సదర్లాండ్ ప్రకటించారు. 20 ఏళ్లుగా పాటిస్తున్న విధానాన్ని కాకుండా కొత్త విధానాన్ని ప్రవేశపెట్టడాన్ని క్రికెటర్లు వ్యతిరేకిస్తున్నారు. గత 20 ఏళ్లుగా లాభాల్లో కొంత మొత్తాన్ని క్రికెటర్లకు ఇచ్చే విధానాన్ని క్రికెట్ ఆస్ట్రేలియా కొనసాగిస్తోంది.
ఇప్పుడు అర్ధాంతరంగా ఆ విధానాన్ని మార్చడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీంతో పాటు జూన్ 30లోపు కొత్త కాంట్రాక్ట్పై సంతకాలు చేయకపోతే.. ఆ తర్వాత జీతాలు కూడా ఇవ్వబోమని సీఏ బెదిరింపులకు దిగుతోంది. దీంతో ఆసీస్ క్రికెటర్లు సమ్మె దిశగా ఆలోచన చేస్తున్నారు. ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్కు కూడా దూరంగా ఉంటామని పలువురు క్రికెటర్లు అంటున్నారు.